న్యూఢిల్లీ: మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఇండియాలో జరిపే ట్రాన్సాక్షన్ల డేటాను కచ్చితంగా ఇక్కడి సర్వర్లలోనే స్టోర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో డేటా సెంటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. డెల్, యాక్సెంచర్, ఎన్టీటీ గ్లోబల్, ఐబీఎం, ఫ్లిప్కార్ట్, ఐసీఐసీఐ, క్యాప్జెమినీ, వెల్స్ఫార్గో, ఒరాకిల్, భారతీ ఎయిర్టెల్ వంటి బడా కంపెనీలు భారతదేశంలో పెద్ద డేటా సెంటర్లను నిర్వహిస్తున్నాయి. వీటిలో పనిచేయడానికి వేలాది మంది అవసరం కావడంతో కంపెనీలు ట్యాలెంట్ కోసం వేటలో పడ్డాయి. డేటా లోకలైజేషన్కు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడంలో ఇవి ఎంతో కీలకం. ఎంటర్ప్రైజ్ డేటా సెంటర్, కమర్షియల్క్లౌడ్ సేవలు కూడా అందించే అమెరికన్ కంపెనీలు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్లకూ భారీగా ఉద్యోగుల అవసరం ఉందని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ డేటా సెంటర్లకు నాన్ టెక్నికల్ స్టాఫ్ కూడా భారీగా కావాలి. డేటా సెంటర్లకు ఎక్విప్మెంట్ను చూసుకోవడానికి సిస్టమ్ ఇంజనీర్లతోపాటు నెట్వర్క్ మేనేజర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కావాల్సి ఉంటుందని అమెరికా డేటా సెంటర్ ఫర్మ్ ఈక్వినిక్స్ ఎండీ మనోజ్ పాల్ అన్నారు. డేటా సెంటర్లను నిర్మించడం మొదలుకొని నిర్వహించడం వరకు.. ఇలా ప్రతి స్టేజీలోనూ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తారని వివరించారు.
జాబ్స్ ఇవ్వడానికి రెడీ...
కేవలం గత రెండు వారాల్లో డేటా సెంటర్ కంపెనీల్లో ఎనిమిది వేల పొజిషన్లకు రెజ్యుమేలను ఆహ్వానించాయని స్పెషలిస్ట్ స్టాఫింగ్ ఫర్మ్ ఫెనో పేర్కొంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల కెపాసిటీ రెట్టింపు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల సంఖ్య మరింత పెరుగుతుందని ఈ కంపెనీ కో–ఫౌండర్ కమల్ కారంత్ అన్నారు. ముంబై, చెన్నై, పూణే, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా అంతటా డేటా సెంటర్ల ప్రస్తుత ఇన్స్టాల్డ్ కెపాసిటీ 500 మెగావాట్లు కాగా, ఇవి10.5 మిలియన్ చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో ఈ కెపాసిటీకి 990 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. అయితే ఉద్యోగుల సంఖ్య ఇంత వేగంగా పెరగకపోవచ్చని కారంత్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో డేటా సెంటర్ పరిశ్రమకు మౌలిక సదుపాయాల హోదాను మంజూరు చేయడం వల్ల వీటికి డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 2025 నుంచి డేటా సెంటర్లకు గిరాకీ తారస్థాయికి చేరుకుంటుందని గ్రేహౌండ్ రీసెర్చ్ చీఫ్ ఎనలిస్ట్ సంచిత్ వీర్ గోగియా అన్నారు. ప్రభుత్వం డేటా సెంటర్లకు తగినంత కరెంటు ఇవ్వాలన్నారు.
భారీ పెట్టుబడులు
నాస్కామ్ ఫిబ్రవరి 2021 రిపోర్టు ప్రకారం, భారతదేశంలో డేటా సెంటర్ల కోసం పెట్టుబడులు 2025 నాటికి సంవత్సరానికి 4.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీలో ప్రధాన డేటా సెంటర్లు ఉన్నాయి. క్వాలిటీ ఫైబర్ కనెక్టివిటీ, కస్టమర్లకు చేరువగా ఉండటం, నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ దొరకడం, సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీ వంటివి అందుబాటులో ఉండటం ఇందుకు ముఖ్యమైన కారణాలు. స్కిల్డ్ వర్క్ఫోర్స్ ఎక్కువగా ఉన్న చోట డేటా సెంటర్లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయని నాస్కామ్ పేర్కొంది. నార్త్ అమెరికా, వెస్ట్ యూరప్లో తగినంత ఇంజనీరింగ్ ట్యాలెంట్ లేక కంపెనీలన్నీ ఇండియావైపు చూస్తున్నాయని రిపోర్టు పేర్కొంది. డిమాండ్ తీర్చాలంటే ఇండియాలో ఇప్పుడున్న డేటా సెంటర్ల కెపాసిటీ కనీసం పది రెట్లు పెరగాలని యోటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఈఓ సునీల్ చెప్పారు. డేటా సెంటర్ నడపడానికి, కస్టమర్ సర్వీసులు అందించడానికి కనీసం వెయ్యి మంది అవసరమవుతారని చెప్పారు. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్లను నిర్మించడానికి అదనంగా 2,500 మందిని ఇన్డైరెక్ట్గా నియమించుకుంటామని ఆయన వెల్లడించారు. వీటి నిర్మాణం కోసం రాబోయే ఏడేళ్లలో రూ.15 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని వెల్లడించారు. క్లౌడ్నెట్వర్కింగ్, ఇతర ఐటీ ఇన్ఫ్రా సేవలను అందిస్తామని సునీల్ వివరించారు.