యాదగిరిగుట్ట ఈవోను తొలగించాలని డిమాండ్

యాదగిరిగుట్ట  ఈవోను తొలగించాలని డిమాండ్

యాదగిరిగుట్ట, వెలుగు: మూడేళ్ల కిందనే రిటైర్డ్ అయినా యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా కొనసాగుతున్న గీతారెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావును తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు.  శనివారం యాదగిరిగుట్టలోని సీపీఐ ఆఫీస్ లో శనివారం నిర్వహించిన మండల సమావేశంలో ఆయన మాట్లాడారు.  

యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో స్థానికుల అభిప్రాయాలు తీసుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని మండిపడ్డారు.   ఆటో డ్రైవర్లు, దుకాణాలు నడుపుకునే చిరువ్యాపారులను రోడ్డున పడ్డారని, వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.  కొండపైకి ఆటోలను అనుమతించాలని రిక్వెస్ట్ చేశారు.

ఆలయ పునర్నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.  అనంతరం యాదగిరిగుట్ట  సీపీఐ మండల కార్యదర్శిగా చిన్నకందుకూరు ఉప సర్పంచ్ కల్లెపల్లి మహేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సభ్యులు బొలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, చెక్క వెంకటేష్, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరెటి రాములు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, ఆరె పుష్ప, భాగ్యమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.