శేరిలింగంపల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత

శేరిలింగంపల్లిలో అక్రమ కట్టడాల కూల్చివేత

అక్రమ కట్టడాలపై శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. మున్సిపల్ జోనల్ కార్యాలయంలో పరిధిలోని అయ్యప్ప సొసైటిలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాల పై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొరడా ఝళిపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కడుతున్న బిల్డర్లకు గతంలోనే హెచ్చరికలు జారీ చేసినా.. నిర్మాణాలు ఆపకపోవడంతో మంగళవారం(డిసెంబర్ 19) మున్సిపల్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు.

అయ్యప్ప సొసైటీలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు కూడా ఇచ్చామని త్వరలోనే మరిన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి జోనల్ కార్యాలయంలో శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.