ముందస్తు సమాచారం లేకుండా స్కూల్ బిల్డింగ్ కూల్చివేత

 ముందస్తు సమాచారం లేకుండా స్కూల్ బిల్డింగ్ కూల్చివేత

సికింద్రాబాద్/పద్మారావునగర్, వెలుగు: ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వ స్కూల్​బిల్డింగ్​ను కాంట్రాక్టర్ ​కూల్చివేయడం వివాదానికి కారణమైంది. క్లాసులు, ఎగ్జామ్స్​ జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండా కూల్చివేతలు చేపట్టడంతో స్టూడెంట్లు చెట్ల కిందకు చేరారు. తల్లిదండ్రులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన  సీతాఫల్​మండిలోని ప్రభుత్వ స్కూల్ వద్ద జరిగింది. సీతాఫల్ మండి ప్రభుత్వ స్కూల్ నూతన భవన నిర్మాణానికి  ఇటీవల డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ రూ.29.75 కోట్లు మంజూరు చేయించారు.

దీంతో పాత భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించి పనులను కాంట్రాక్టర్​కు అప్పగించారు. అయితే సదరు కాంట్రాక్టర్ ​విద్యాశాఖకు గానీ, స్కూల్ ​అధికారులకు గానీ ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా సెలవు రోజు అయిన ఉగాది రోజు స్కూల్ బిల్డింగ్ కూల్చివేతలు చేపట్టారు. టీచర్లు, స్టూడెంట్లు గురువారం ఉదయం స్కూల్​కు చేరుకోగా అప్పటికే బిల్డింగ్ పాక్షికంగా కూల్చివేతకు గురై ఉండటంతో షాక్​కు గురయ్యారు. ల్యాబ్​లు, గదుల్లోని అల్మారాలు పగులగొట్టారు. వాటిలో ఉన్న రికార్డ్స్ ధ్వంసమమైనట్లు టీచర్లు తెలిపారు. 

కూర్చునేందుకు గదులు లేకపోవడంతో సుమారు 500 మంది స్టూడెంట్లు స్కూల్​ ఆవరణలోని చెట్ల కిందకు  వచ్చి అక్కడే కూర్చున్నారు. ప్రీ-ఫైనల్​ఎగ్జామ్స్ ఉన్న టెన్త్​ క్లాస్​ స్టూడెంట్లు కూల్చివేతకు గురై కరెంట్ లేని చీకటి గదుల్లోనే ఎగ్జామ్స్ రాశారు. సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. స్కూల్ సమీపంలోనే ఉన్న  డిప్యూటీ స్పీకర్ క్యాంప్ ​ఆఫీసుకు చేరుకుని ఆందోళన చేశారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తం: డీఈవో 

కూల్చివేత విషయం తెలుసుకున్న హైదరాబాద్​డీఈవో రోహిణి స్కూల్​కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కూల్చివేసిన గదులను పరిశీలించి స్టూడెంట్లు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా స్టూడెంట్లను పక్కనే ఉన్న ఓయూ మోడల్ ​స్కూల్​కు మార్చాలని గతంలోనే నిర్ణయించామని, ఇందుకోసం వైస్​చాన్సలర్​అనుమతి కోరామని తెలిపారు.

అనుమతులు వచ్చాకే భవనం కూల్చివేతలు చేపట్టాల్సిఉండగా.. కాంట్రాక్టర్ ​ఇప్పుడే కూల్చివేతలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. సదరు కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విద్యాశాఖ మంత్రి,  ఉన్నతాధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.