- జీటీ పాయింట్ విధానంతో పక్కాగా, స్పీడ్గా అప్ లోడ్
- ఇప్పటికే 20 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్గా పరిశీలన
హైదరాబాద్, వెలుగు: పక్కాగా పంటల నమోదు కోసం శాటిలైట్ సర్వే చేపట్టడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సరికొత్త టెక్నాలజీ వినియోగానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా క్లస్టర్ల వారీగా ప్రతి 300 మీటర్లలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు అవుతున్నాయనేది పక్కాగా లెక్కించేందుకు శాటిలైట్ సర్వే చేయాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఏఈవో యాప్లో ‘గ్రౌండ్ ట్రూత్ పాయింట్’(జీటీ పాయింట్)ను అందుబాలోకి తీసుకొచ్చింది. ఫస్ట్ ఫేజ్లో రాష్ట్రంలోని 144 మండలాల్లోని 318 క్లస్టర్లో శాటిలైట్ సర్వే చేపట్టింది. ప్రతి క్లస్టర్లో జీటీ పాయింట్లను నమోదు చేయనున్నారు. క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులు ఆయా క్లస్టర్ పరిధిలోని పాయింట్ వద్దకు వెళ్లి దాని పరిధిలో ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు వేశారనేదాన్ని శాటిలైట్ సర్వే సాయంతో నమోదు చేయనున్నారు.
గతంలో లెక్కల్లో వ్యత్యాసం
వ్యవసాయ శాఖలో కొన్నేండ్లుగా ఏఈవోలు రోజువారీ అటెండెన్స్, రైతుబీమా, రైతుబంధు నమోదు కోసం ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లు, మొబైల్ ఫోన్లలో యాక్టివ్ లాగర్ యాప్ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా సర్వే నంబర్ల ఆధారంగా పంటలు నమోదు చేస్తూ వస్తున్నారు. మొదట్లో రైతు యూనిట్గా పంటల సర్వే చేపట్టగా పంటలు అమ్ముకునే టైమ్లో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సర్వే నంబర్ల ఆధారంగా యాప్లో క్రాప్స్ అప్లోడ్ చేశారు. ఈ విధానంలోనూ ఈఏవోలు ఫీల్డ్కు వెళ్లినప్పుడు రైతులు రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలాంటి పలు లోటుపాట్లను సరి చేసి కచ్చితత్వంతో పంటల నమోదు చేపట్టేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చింది.
ఫీల్డ్ కు పోతేనే యాప్ ఓపెన్
సర్వే నంబర్కు వెళ్లినప్పుడే వివరాలు కనిపించేలా కొత్త యాప్లో మాడ్యుల్ను రూపొందించారు. ఈ విధానంలో ఏఈవోలు ఒక సర్వే నంబర్కు వెళ్లాల్సి వస్తే గూగుల్లో జియోఫెన్స్ ద్వారా ఆ లోకేషన్ చేరుకోవచ్చు. శాటిలైట్ ద్వారా 300 మీటర్ల దూరంలో ఉన్న సర్వే నంబర్ వివరాలు ట్యాబ్లోని యాప్లో కనిపిస్తాయి. దీంతో రెవెన్యూ సిబ్బంది, రైతుల అవసరం లేకపోయినా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
పైలెట్ ప్రాజెక్ట్ పూర్తి.. ప్రభుత్వానికి రిపోర్ట్
రాష్ట్రంలోని 20 జిల్లాల్లో శాటిలైట్ సర్వేను 4 రోజులు పైలెట్ ప్రాజెక్ట్గా అమలు చేశారు. ఈ నెల 18న సర్క్యూలర్ జారీ చేసి.. 20 నుంచి 23తేదీ వరకు సర్వే పూర్తి చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, మహబూబాబ్నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సర్వే చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 మండలాల్లోని 318 క్లష్టర్లలో జీటీ పాయింట్ సర్వే చేపట్టారు. పంటల వారీగా 6,515 జీటీ పాయింట్లలో సర్వే చేశారు. ఈ సదర్భంగా యాప్లో పనితీరు, లోటుపాట్లపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. తర్వలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తేనున్నారు.