
- మధిర పట్టణ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష
- నాణ్యతగా, వేగంగా పనులు చేపట్టాలి
మధిర, వెలుగు: మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధిర పట్టణ సమగ్ర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నెలకు ఒకసారి మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రతి 15 రోజులకు సీఈ స్థాయి అధికారులు విధిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
నాణ్యతతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రగతికి సంబంధించి ప్రతి వారం, 15 రోజులు, నెల రోజులు వ్యవధిలో టార్గెట్ లు నిర్దేశించుకుని ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిర్మాణానికి సంబంధించి మధిర పట్టణ ప్రజలకు వివరంగా తెలియజేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మమైన ఈ ప్రాజెక్టు పనులపై తాను తరచూ సమీక్ష చేస్తానని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు.
జాలిముడి నుంచి తాగునీటి సరఫరాపై ప్రణాళిక
అమృత్ స్కీం కింద జరుగుతున్న అభివృద్ధి పనులు, జాలిముడి నుంచి మధిర పట్టణానికి తాగునీటి సరఫరా పనులకు సంబంధించిన అంశాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నప్పటికీ అంతరాయాలు లేకుండా భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాలిముడి నుంచి మధిర పట్టణ ప్రజలకు తాగునీరు అందించే ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు.
జూబ్లీహిల్స్ వైకుంఠధామం తరహాలో నిర్మించాలి
వైకుంఠధామం లో జరుగుతున్న పనులను డిప్యూటీ సీఎం సమీక్షించారు. వైకుంఠధామం భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పనులపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ వైకుంఠ ధామం తరహాలో మధిర వైకుంఠధామం నిర్మాణం జరగాలని ఆదేశించారు. నెల రోజులు అంబేద్కర్ స్టేడియం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మధిర పట్టణంలో చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్ కు తరలించాలి తప్ప రహదారుల వెంట చెత్త కనిపించడానికి వీల్లేదని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
వరద నీరు వెళ్లిపోవడానికి మున్సిపల్ అధికారులు రూపొందించిన డ్రైనేజీ ప్రణాళికలను సమీక్షించారు. మధిర మున్సిపల్ నూతన భవన నిర్మాణ ప్రణాళికలు, ఎలివేషన్ పనుల పైన సమీక్షించారు. పర్యాటక, మున్సిపల్, రోడ్లు భవనాల ఈ మూడు శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ట్యాంక్ బండ్, ఇతర నగర సుందరీకరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ. టీకే శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఈఎన్సి భాస్కర్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.