భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో .. 800 మెగా వాట్ల విద్యుత్​ ప్లాంట్ వచ్చేనా?

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ..  800 మెగా వాట్ల విద్యుత్​ ప్లాంట్ వచ్చేనా?
  • శుభవార్త వింటారని పాల్వంచ పర్యటనలో డిప్యూటీ సీఎం హామీ
  • జిల్లాలో నీరు, బొగ్గు, ట్రాన్స్​పోర్టు, ల్యాండ్​లాంటి వనరులు పుష్కలం
  • భట్టి ప్రకటన కోసం జిల్లావాసుల ఎదురుచూపులు  

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పాల్వంచలో 800 మెగా వాట్ల విద్యుత్​ప్లాంట్ ఏర్పాటు కోసం జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించిన వనరులు జిల్లాలో పుష్కలంగా ఉండడంతోపాటు ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్వంచలో విద్యుత్​ ప్లాంట్​ ఏర్పాటుపై త్వరలో శుభవార్త వింటారని చెప్పడంతో స్థానికుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.

ప్లాంట్​కు వనరులు ఫుల్.. 

పాల్వంచలో ప్రస్తుతం 5,6 దశల్లో వెయ్యి మెగావాట్లు, ఏడో దశలో 800మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి అవుతోంది. వచ్చే పదేండ్ల కాలంలో 5,6 దశల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్లు మూసివేయనున్నారు. ఇదే ఆవరణలో కేటీపీఎస్​ ఎనిమిదో దశ విద్యుత్​ ప్లాంటకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, థర్మల్​ విద్యుత్​ పవర్​ ప్లాంట్​ ఏర్పాటులో కీలకమైనది భూ సమస్య. భూ సేకరణ, పరిహారం చెల్లించడంతో పాటు ప్లాంట్​ నిర్మాణం, గ్రిడ్​ లైన్ల ఏర్పాటు, నీళ్ల కోసం కెనాల్స్​ తవ్వడానికి రూ. వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 

కానీ పాల్వంచలో 800మెగా వాట్ల విద్యుత్​ ప్లాంట్​కు అవసరమైన భూమికి ఢోకాలేదు. పట్టణంలోని కేటీపీఎస్​ లో 720 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ను కాలం చెల్లడంతో ఇటీవల కాలంలో కూల్చివేశారు. ఈ స్థానంలో కొత్తగా 800మెగా వాట్ల విద్యుత్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది.  కిన్నెరసాని నీళ్లు ప్లాంట్​కు సప్లై అవుతున్నాయి.  విద్యుత్​ ప్లాంట్​కు అవసరమైన బొగ్గును పాల్వంచకు అతి సమీపంలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లోని సింగరేణి బొగ్గు గనుల నుంచి సప్లై చేసే వీలుంది. ఇందుకు అవసరమైన రోడ్డు, రైలు మార్గాలున్నాయి. ఉత్పత్తి చేసిన విద్యుత్​ను అనుసంధానించేందుకు అతి కీలకమైన గ్రిడ్​ లైన్లు ఉన్నాయి. విద్యుత్​ ఉత్పత్తిలో భాగంగా వచ్చే బూడద కోసం యాష్​ పాండ్స్​ ఉన్నాయి.

పాల్వంచకు పూర్వ వైభవం వచ్చేనా..? 

జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న పాల్వంచ దశాబ్దాల కాలంగా రాష్ట్రానికి వెలుగులను అందిస్తోంది. పాల్వంచలో కాలం చెల్లిన 720 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన పాతప్లాంట్​ కేటీపీఎస్​ ఓ అండ్​ఎంను ఇటీవల అధికారులు తొలగించారు. దీంతో ఈ ప్లాంట్​లో పనిచేసే దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. కుటుంబాలతో సహా బదిలీ అయిన ప్రాంతాలకు వెళ్లడంతో వ్యాపారాలు తగ్గి పాల్వంచ పట్టణం కళ కోల్పోయింది. ఇప్పుడు పాత ప్లాంట్​తొలగించిన ప్రాంతంలో 800 మెగావాట్ల విద్యుత్​ ప్లాంట్​ను కొత్తగా ఏర్పాటు చేస్తే పాల్వంచకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయని పట్టణ వాసులు పేర్కొంటున్నారు. 

కాగా, ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్వంచలో పర్యటించారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన అధికారిక ప్రోగ్రాంలో అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వర రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్వంచలో 800 మెగా వాట్ల విద్యుత్​ ప్లాంట్ ఏర్పాటు విషయమై భట్టి దృష్టికి తీసుకువచ్చారు. అతి తక్కువ ఖర్చుతో 800 మెగా వాట్ల విద్యుత్​ ప్లాంటు ఏర్పాటు చేసుకోవచ్చనే విషయాన్ని వివరించారు. విద్యుత్​ ప్లాంట్​ ఏర్పాటుపై సాధ్యా సాధ్యాలపై ఫీజిబిలిటీ నివేదికలను తెప్పించుకుంటానని, త్వరలో శుభవార్త చెప్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. దీని కోసం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.