
న్యూఢిల్లీ: టారిఫ్ వార్ వల్ల మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, గత నెలలో ఈక్విటీ - ఆధారిత మ్యూచువల్ ఫండ్స్లోకి నికరంగా రూ. 42,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఈ విభాగంలో ఇప్పటి వరకు అత్యధిక నెలవారీ మొత్తం. థీమాటిక్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో ఇన్ఫ్లోలు భారీగా ఉన్నాయి. జూన్లో నమోదైన రూ. 23,587 కోట్లతో పోలిస్తే ఇది 81శాతం అధికం. రిస్క్ తీసుకునే ధోరణి మళ్లీ పెరిగిందని ఈ పెట్టుబడులు సూచిస్తున్నాయని ఎక్స్పర్టులు అంటున్నారు.
మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) విడుదల చేసిన డేటా ప్రకారం, సిప్ పెట్టుబడులు జూన్లో రూ. 27,269 కోట్ల నుంచి జులైలో రూ. 28,464 కోట్లకు పెరిగాయి. ఈక్విటీ- ఆధారిత మ్యూచువల్ ఫండ్ విభాగాలలో, సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్స్ రూ. 9,426 కోట్ల నికర పెట్టుబడులతో మొదటిస్థానంలో ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన ఏడు పథకాలు రూ. 7,404 కోట్లను సేకరించాయి.
ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్ రూ. 7,654 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ (రూ. 6,484 కోట్లు), మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ. 5,182 కోట్లు), లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో (రూ. 5,035 కోట్లు) బలమైన పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీ- లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ నుంచి మాత్రం రూ. 368 కోట్లు బయటకు వెళ్లాయి. జులైలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు మొత్తం రూ. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్లో రూ. 49 వేల కోట్లు వచ్చాయి. డెట్ ఫండ్స్లోకి రూ. 1.06 లక్షల కోట్లు, గోల్డ్ ఈటీఎఫ్ లోకి రూ. 1,256 కోట్లు వచ్చాయి. ఈ భారీ పెట్టుబడులతో ఈ పరిశ్రమ ఆస్తుల విలువ మొదటిసారిగా రూ. 75 లక్షల కోట్లను దాటింది.