వరంగల్ రూరల్, వెలుగు: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బాలసముద్రం జయశంకర్ స్మృతివనంలోని సీఎం కేసీఆర్ బొమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎంజీఎం టూర్ పేరుతో కేసీఆర్ వరంగల్ కు వచ్చినరోజే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన పేరుతో స్మృతివనం నిర్మించింది. పార్కులో ఏర్పాటు చేసిన గోడపై జయశంకర్ గుర్తుగా ఆయనకు సంబంధించిన కొన్ని చిత్రాలు చెక్కించారు. అదే టైంలో వివిధ ఫ్రేముల్లో జయశంకర్తో పోటీపడేలా కేసీఆర్ బొమ్మలను గీశారు. టీఆర్ఎస్ లీడర్లు ప్రొఫెసర్ ఇంపార్టెన్స్తగ్గించాలనే ఇలా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రజా, కుల సంఘాలు పార్కు వద్ద నిరసన తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చిత్రాలు తీసేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఇవేం లెక్క చేయకుండా సైలెంట్గా పనులు పూర్తి చేసి కలర్లు వేసింది. ఏప్రిల్ 15న ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ పార్కును ప్రారంభించారు. గుర్తుతెలియని వ్యక్తులు గోడపై ఉన్న కేసీఆర్బొమ్మల్లో ఒక బొమ్మను ధ్వంసం చేశారు.
