
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి గురువారం హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన ఎం.కృష్ణచైతన్య, రాజ్యలక్ష్మి దంపతులు బంగారు హారాన్ని సమర్పించారు. రూ.4,98,520 విలువ చేసే 52.25 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని ఈవో రమాదేవి చేతుల మీదుగా అందించారు. అంతకుముందు ఉదయం స్వామికి గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవను చేశారు.
విశేషహారతులు సమర్పించాక బాలబోగం నివేదించారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. భక్తులు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజభోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.