యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రిలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. సండే సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు.  దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది.  భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లుగా ఆలయ అధికారులు  వెల్లడించారు. 

స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతాల దగ్గర కూడా భక్తులు కిక్కిరిసిపోయారు.   స్వామివారి స్వాతి నక్షత్రం పురస్కరించుకొని  ఆలయ అర్చకులు శతఘటాభిషేకం నిర్వహించారు.

కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడ భక్తులు సందర్శించి.. ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. 

కొమురవెళ్లిలో భక్తుల రద్దీ

మరోవైపు సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో సంప్రదాయబద్దంగా మల్లన్నకు భక్తులు పట్నాలు, బోనాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. తమ కోరికలు తీర్చమంటూ గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టారు.