ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల నమోదుపై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర హెల్డ్ డైరెక్టర్ (DH)శ్రీనివాస రావు స్పష్టం చేశారు. భారత్లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని.. దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో ఉన్నాయని చెప్పారు. కొత్త రకమైన కేసులు వస్తే ప్రభుత్వమే నేరుగా ప్రకటిస్తుందని చెప్పారు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారన్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.
ఒమిక్రాన్ కేసుల క్రమంలో 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ కు అత్యంత వేగం వ్యాపించే గుణం ఉందన్న.. విదేశాల నుంచి వచ్చేవారికి ఇవాళ అర్ధరాత్రి నుంచి ఎయిర్ పోర్ట్ లో RTPCR పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినవారిని ఆస్పత్రికి తరలిస్తామన్నారు. ఒమిక్రాన్ కేసులు గుర్తించిన 12 దేశాల నుంచి 40 మందికి పైగా రాష్ట్రానికి వచ్చారని.. వారందరికీ నెగటివ్ రావడంతో హోం క్వారంటైన్కి పంపామని తెలిపారు. వారి ఆరోగ్యాన్ని 14 రోజులు గమనిస్తామని వివరించారు. ఒమిక్రాన్కు డెల్టా కంటే 6 శాతం వేగంగా వ్యాపిస్తున్నట్లు గుర్తించారని.. కానీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందన్నారు. ఎన్ని మ్యుటేషన్లు వచ్చినా కొవిడ్ నిబంధనలను పాటిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు DH శ్రీనివాస రావు.