తిరుపతిలో డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 16 వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాల కార్యక్రమం నిత్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. ధనుర్మాసం సందర్భంగా దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారని తెలిపింది టీటీడీ. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఏపీలో 76, తెలంగాణ 57, తమిళనాడు- 73, కర్ణాటక- 21, పాండిచ్చేరి- 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒకొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నట్లు తెలిపింది టీటీడీ. తిరుమలలో కూడా ధనుర్మాసంలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై నివేదించడం విశేషం.
12 మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారని... ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుందని అంటున్నారు. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో ఉంది.
ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ వ్రతం ఒక్కరుగా కాకుండా అందరినీ కలుపుకొని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని చెబుతున్నారు పండితులు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపింది టీటీడీ.
