దర్శకుడి కొడుకై.. ఇడ్లీ తినడానికి డబ్బులు లేకపోవడమేంటీ: ట్రోలింగ్‌‌పై ధనుష్ క్లారిటీ

దర్శకుడి కొడుకై.. ఇడ్లీ తినడానికి డబ్బులు లేకపోవడమేంటీ: ట్రోలింగ్‌‌పై ధనుష్ క్లారిటీ

మల్టీ టాలెంటెడ్‌‌ హీరో ధనుష్‌‌ లీడ్ రోల్‌‌లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఇడ్లీ కడై’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్‌‌తో చింతపల్లి రామారావు రిలీజ్ చేస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 1న సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్‌‌ ఈవెంట్‌‌లో తన బాల్యం గురించి మాట్లాడుతూ ధనుష్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

‘చిన్నప్పుడు ఇడ్లీ తినాలనిపించినా తన దగ్గర డబ్బులు ఉండేవి కావని, ఏదైనా చిన్న పనికి వెళ్లి ఆ డబ్బుతో ఇడ్లీ తినేవాడినని ధనుష్ చెప్పాడు. అయితే ఈ కామెంట్స్‌‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌ జరిగింది. ఒక దర్శకుడి కొడుకైన ధనుష్‌‌.. ఇడ్లీ కొనుక్కోలేనంత పేదరికంలో గడిపానని చెప్పడం నమ్మశక్యంగా లేదనేది ఆ విమర్శల సారాంశం.

లేటెస్ట్గా మధురైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో దీనిపై ధనుష్ స్పందించాడు. 1983లో తాను పుట్టగా, 1991లో తన తండ్రి దర్శకుడు అయ్యారని, ఆ ఎనిమేదేళ్ల పాటు తమ కుటుంబం కష్టాల్లోనే ఉందని, 1995 తర్వాతే కుటుంబ పరిస్థితి మెరుగుపడిందని క్లారిటీ ఇచ్చాడు. 

అలాగే తాము నలుగురు సంతానం కావడంతో బయట తినడానికి డబ్బులు ఇచ్చేవాళ్లు కాదని, అందుకే ఏదైనా చిన్న పని చేసి కొనుక్కునేవాడినని స్పష్టం చేశాడు. ఇక ఇదొక ప్రముఖ చెఫ్‌‌ బయోపిక్‌‌ అని జరుగుతున్న ప్రచారాన్ని కూడా ధనుష్‌‌ కొట్టి పారేశాడు.

ట్రైలర్ విషయానికి వస్తే:

తన తండ్రిని ఒప్పిస్తూ  ‘ఇడ్లీ  గ్రైండర్‌‌‌‌ కొంటే పని తేలిక అవుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది’ అని ధనుష్ చెప్పే సీన్‌‌‌‌తో మొదలైన ట్రైలర్ హార్ట్ టచ్చింగ్‌‌‌‌గా సాగింది. మురళి పాత్రలో మధ్య తరగతి వ్యక్తిగా ధనుష్ కనిపించిన తీరు ఆకట్టుకుంది.

తన తండ్రి దగ్గర ఉన్న సంప్రదాయ ఇడ్లీ కొట్టు మీద మురళికి చాలా అనుబంధం ఉంటుంది. ఆ ఇడ్లీ బండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లందరికీ చాలా సెంటిమెంట్. అదే సమయంలో మురళి హోటల్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లోకి వెళ్లి, అరుణ్‌‌‌‌ విజయ్‌‌‌‌ చేసిన అశ్విన్ పాత్రతో కలిసి పనిచేస్తాడు.

వ్యాపారం లాభాలు పెరగడానికి మురళి సహాయం చేస్తాడు. కానీ అశ్విన్‌‌‌‌ నుంచి వచ్చే బెదిరింపులు మురళి భవిష్యత్తు మాత్రమే కాదు, తన తండ్రి పేరు, వారసత్వానికి సవాల్‌‌‌‌గా మారుతాయి. దాంతో మురళి ఎదుర్కోబోయే సవాళ్లు, తన గౌరవం కోసం చేసే పోరాటమే కథలో ప్రధానంగా మారుతుంది. 

ధనుష్​, నిత్యా మీనన్ మధ్య  కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌గా నిలిచింది. శాలిని పాండే, సత్యరాజ్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మరింత ఎలివేట్ చేసింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 1న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.