75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్లో ఓబిసి బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీ జంతర్ మంతర్లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అటు ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీని ప్రధాని మంత్రిని చేసినందుకు..వెనుకబడిన తెగకు సంబంధించిన మహిళను రాష్ట్రపతి చేసినందుకు బీజేపీని మెచ్చకుంటున్నామని ఆర్. కృష్ణయ్య అన్నారు. అయితే ప్రధాని బీసీ అయినా..బీసీలకు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు. బీసీల అభివృద్ధికి కృషి చేయకుండా ప్రధానిని అడ్డుకుంటున్నారని చెప్పారు. 30 లక్షల కోట్ల దేశ బడ్జెట్ అయితే బీసీలకు 40 వేల కోట్లు మాత్రమే ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. దేశంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు రెండు లక్షల కోట్లతో బడ్జెట్ కేటాయించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.