
అబద్ధాలు ప్రచారం చేస్తూ విభజించు.. పాలించు అనే దుర్నీతితో మోదీ పాలన కొనసాగుతోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గురువారం బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మధ్య ఎన్నడూ లేనంతగా మోదీపై దీదీ ఫైరయ్యారు.
బెంగాల్ ముర్షీదాబాద్ అల్లర్లపై బీజేపీ ద్వంద్వనీతి ప్రదర్శిస్తోందని మండి పడ్డారు. అల్లర్లకు ప్రేరేపించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎన్నికలు రేపే పెడతారో.. పెట్టుకోండి.. మాకు భయం లేదు.. రేపంటే రేపు బరిలో దిగేందుకు సిద్ధం’’ అంటూ సవాల్ విసిరారు.
ALSO READ | సంతకాలు జరుగుతాయి.. కానీ ఆయుధాలు అందవు: ఎయిర్ ఫోర్స్ చీఫ్ AP సింగ్ కీలక వ్యాఖ్యలు
మోదీ సమక్షంలోనే బీజేపీ నేత ‘‘ఆపరేషన్ సిందూర్ లాగే ఆపరేషన్ బెంగాల్ చేపడతాం’’ అని వాగితే మోదీ మౌనంగా ఉండటం చూస్తే ఆయన విధానం ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్ధతిస్తే.. మోదీ ప్రభుత్వం మాత్రం విభజించి పాలించాలని చూస్తోందని మండిపడ్డారు. ఆపరేషన్ బెంగాల్ చేస్తారా.. రండి ఎలా చేస్తారో మేమూ చూస్తాం.. రేపు ఎన్నికలు పెడతారా.. దమ్ముంటే రండి చూసుకుందాం అంటూ ఛాలెంజ్ చేశారు.
ALSO READ | భారత్ బ్రహ్మోస్ మిస్సైళ్లతో దాడి చేసింది: ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్ పీఎం
బీజేపీ అంత జుమ్లా పార్టీ దేశంలోనే లేదని అన్నారు మమతా బెనర్జీ. మోదీ ఒక గ్యార్జేబీని నడిపిస్తున్నారని.. వాళ్లు లూటీ చేస్తారని అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయలాని చూస్తారని.. చివరికి సైనికుల త్యాగాన్ని తమ ఖాతాలో వేసుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
పాక్ దుర్నీతిని ఎండగట్టేందుకు విదేశాలకు వెళ్లిన టీమ్ లలో తమ పార్టీ ఎంపీ అబిషేక్ బెనర్జీ ఉన్నారని.. ప్రపంచ వ్యాప్తంగా విపక్షాలన్నీ ఐక్యతను చాటుతుంటే మోదీ మాత్రం విభజన రాజకీయాలకు, స్వార్థ రాజకీయలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై, మోదీ జుమ్లా విధానాలపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. టెలీ ప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేని మోదీ.. అదే టెలిప్రాంప్టర్ తో డిబేట్ రావాలని, దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు మమతా బెనర్జీ.