
న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ రక్షణ రంగ ప్రాజెక్టులపై భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. గురువారం (మే 29) ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2025లో ఆయన మాట్లాడుతూ.. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి.. కానీ ఆయుధాలు మాకు సమయానికి అందవని అన్నారు. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ సందర్భంగా తనకు గుర్తుకు రావట్లేదని.. చేయలేని పనికి వాగ్ధానాలు ఇవ్వడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ప్రకారం డెలివరీలు ఇవ్వకుండా ఆలస్యం చేసిన కొన్నింటి వివరాలను ఆయన లేవనెత్తారు. తేజస్ ఎంకే1 డెలివరీ చాలా ఆలస్యమైంది. తేజస్ ఎంకే2 ప్రోటో టైప్ ఇంకా అందుబాటులోకి రాలేదని గుర్తు చేశారు. కాంట్రాక్టులపై సంతకం చేయడం.. ఆ తర్వాత డెలివరీలు ఆలస్యం చేయడం.. ప్రతీసారి ఇదే పునరావృతం అవుతోందని.. సకాలంలో డెలివరీ చేయలేమని తెలిసినప్పుడు మాట ఇవ్వడం ఎందుకు అని ఆయన కాంట్రాక్టర్లను నిలదీశారు.
ముఖ్యంగా స్వదేశీ అభివృద్ధితో తయారయ్యే రక్షణ వ్యవస్థలు ఆలస్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతూ.. 2021 ఫిబ్రవరిలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో కుదిరిన రూ. 48,000 కోట్ల ఒప్పందంలో భాగమైన తేజస్ Mk1A ఫైటర్ జెట్ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదని.. డెలివరీలు 2024 మార్చిలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆర్డర్ చేసిన 83 విమానాలలో ఏవీ డెలివరీ కాలేదని తెలిపారు. తేజస్ Mk2 నమూనా ఇంకా విడుదల కాలేదు.
మా దగ్గర ఇంకా స్టెల్త్ ఏఎంసీఏ ఫైటర్ నమూనా లేదని పేర్కొన్నారు. కాంట్రాక్ట్పై సంతకం చేసే సమయంలో కూడా గడువులు సాధించలేమని మనకు తెలుసు. అయినప్పటికీ మేము ముందుకు వెళ్తాం.. ఇది మొత్తం ప్రక్రియను రాజీ చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టులు ఆలస్యం చేసే వారికి చురకలంటిస్తూ.. దళాలను శక్తివంతం చేసుకుంటేనే యుద్ధాలు గెలుస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టు ప్రకారం డీల్ క్లోజ్ కాకపోవడం ఆందోళనకర విషయమని అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముందే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ రక్షణ రంగ ప్రాజెక్టుల్లో జరుగుతోన్న ఆలస్యంపై విమర్శలు చేయడం గమనార్హం.