
న్యూఢిల్లీ: 2025, మే 9-10 తేదీల మధ్య రావల్పిండి ఎయిర్ పోర్టుతో పాటు కీలక సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లపై బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ దాడులు చేసిందని పాకిస్థాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఎట్టకేలకు అంగీకరించాడు. భారత్ దాడులు చేసే సమయంలో పాక్ ఆర్మీ సిద్ధంగా లేదని ఆయన ఒప్పుకున్నారు. ఆపరేషన్ సిందూర్ వల్ల తమకు ఎలాంటి నష్టం జరగలేదని.. ఇన్ని రోజులుగా బుకాయించుకుంటూ వస్తోన్న పాక్ చేసేదేమి లేక చివరకు తమకు జరిగిన నష్టాన్ని అంగీకరిస్తుంది.
గురువారం (మే 29) తమ మిత్రదేశమైన అజర్బైజాన్లోని లాచిన్లో జరిగిన ఒక కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యం మే 10న ఉదయం ప్రార్థనల తర్వాత భారతదేశంపై దాడి చేయాలని ప్లాన్ చేసింది. అయితే, తెల్లవారకముందే పాకిస్తాన్లోని రావల్పిండి ఎయిర్ పోర్టుతో పాటు వివిధ ప్రావిన్సులపై బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులతో భారత్ ఎటాక్ చేసింది’’ అని పేర్కొన్నారు. భారత చేసిన దాడి గురించి మునీర్ తనకు తెలియజేశాడని ఆయన చెప్పారు. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకున్నట్లు పాక్ ప్రధాని అంగీకరించారు.
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా భారత్పై దాడులు చేసేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించింది. భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు యత్నించింది. దీంతో ఒకవైపు పాక్ దాడులను తిప్పికొడుతూనే.. మరోవైపు వాళ్లకు ధీటుగా కౌంటర్ ఎటాక్ చేసింది భారత సైన్యం. భారత అమ్ములపొదిలో బ్రహ్మస్త్రమైన బ్రహ్మోస్ మిస్సైళ్లతో పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది.
నూర్ ఖాన్తో పాటు, రఫీకి, మురిద్, రహీమ్ యార్ ఖాన్, సుక్కుర్, చునియన్లలోని పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎటాక్ చేసింది. భారత దాడుల్లో స్కర్డు, భోలారి, జాకోబాబాద్, సర్గోధాలోని ఎయిర్ బేస్లు కూడా అపారమైన నష్టాన్ని చవిచూశాయి. భారత్ చేసిన దాడుల్లో తమకు జరిగిన నష్టాన్ని పాక్ ప్రధాని బహిరంగంగా ఒప్పుకోవడం గమనార్హం.