
రాజ్యసభతో పోల్చినప్పుడు లోక్సభ ఎక్కువ అధికారాలు, ప్రాధాన్యతనూ కలిగి ఉన్నది. లోక్సభ భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా పేర్కొనే లోక్సభ అనేక విషయాల్లో ప్రాధాన్యతను మాత్రమే కాకుండా ఆధిక్యతను కలిగి ఉన్నది.
కేంద్ర ప్రభుత్వ విషయంలో
కేంద్ర ప్రభుత్వాన్ని (మంత్రి మండలిని) ఏర్పాటు చేయాలంటే లోక్సభలో మెజార్టీ సాధించిన పార్టీకి మాత్రమే అవకాశం ఉన్నది. 75(3)వ అధికరణ కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమష్టి బాధ్యత వహిస్తుందని పేర్కొంటుంది. లోక్సభ కేంద్ర మంత్రి మండలిపై అదుపును కలిగి ఉంటుంది. కేంద్ర మంత్రి మండలిని లోక్సభ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన అధికార బిల్లులు, తీర్మానాలు వీగిపోయినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులు, తీర్మానాలు నెగ్గినప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించి మనదేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులోనూ, పని విధానంలోనూ, ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడంలోనూ లోక్సభ కీలకపాత్రను పోషిస్తుంది. అంటే కేంద్ర మంత్రి మండలి భవిష్యత్ నిర్ణయించేది లోక్సభ మాత్రమే.
ఆర్థిక బిల్లుల విషయంలో
ఒక బిల్లు ఆర్థికమైనది, కానిది లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి అనుమతితో మొదట లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయం తెలపాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. లోక్సభ పంపిన బిల్లులను రాజ్యసభ తిరస్కరించినా, సవరణలు చేసినా ఆ బిల్లులు తిరిగి లోక్సభ పరిశీలనకు వెళ్తాయి. రాజ్యసభ తిరస్కరించి పంపించిన ఆర్థిక బిల్లులను సవరణలతో గానీ, సవరణలు లేకుండా గానీ లోక్సభ రెండోసారి ఆమోదించినట్లయితే రాజ్యసభ పరిశీలనకు పంపకుండానే లేదా ఆమోదంతో నిమిత్తం లేకుండానే రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. ఆర్థిక బిల్లుల విషయంలో వీటో చేసే అధికారం రాష్ట్రపతికి కూడా లేదు. అందువల్ల ఆర్థిక బిల్లుల విషయంలో లోక్సభ తిరుగులేని ఆధిక్యతను కలిగి ఉంటుంది.
సాధారణ బిల్లుల విషయంలో
సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. లోక్సభ ఆమోదించి పంపిన బిల్లులను రాజ్యసభ తిరస్కరించినా సవరణలు సూచించినా ఆరు నెలల్లోగా ఎలాంటి నిర్ణయం తెలపకపోయినా ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినట్లుగా భావిస్తారు. సాధారణ బిల్లులపై ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు రాష్ట్రపతి 108వ అధికరణ ద్వారా సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. ఉభయసభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. సంయుక్త సమావేశంలో జరిపే ఓటింగ్ను అనుసరించి బిల్లు భవిష్యత్ను నిర్ణయిస్తారు. లోక్సభ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లోక్సభ అభిప్రాయమే నెగ్గుతుంది. ఉభయసభల సంయుక్త సమావేశంలో జరిపే ఓటింగ్ లో బిల్లు నెగ్గినా, ఓడినా ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఓటింగ్లో బిల్లు ఓడిపోయినట్లయితే, బిల్లు వీగిపోతుంది. ఉదాహరణకు 1961లో వరకట్న నిషేధపు బిల్లును లోక్సభలో ఆమోదించి, రాజ్యసభలో తిరస్కరించడం వల్ల ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు సందర్భంలో
44వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని కల్పించారు. దీని ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే లోక్సభ ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలి. జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలని కోరుతూ లోక్ సభలోని 1/10వ వంతు సభ్యులు ఒక తీర్మాన నోటీసును లోక్సభ స్పీకర్కు లేదా రాష్ట్రపతికి సమర్పించవచ్చు. 14 రోజుల్లోగా లోక్సభ ఈ అంశాన్ని చర్చించి సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తే అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తారు. అందువల్ల జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు విషయంలో లోక్సభ ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది.