- పెరుగుతున్న ఫేక్ లోన్లు
- మరింత ఎక్కువైన కార్డ్ ఫ్రాడ్లు
- భారీగా వెలుగుచూస్తున్న ఐడెంటిటీ థెఫ్ట్లు..
న్యూఢిల్లీ: మొబైల్ యాప్తో లోన్లు ఇచ్చే డిజిటల్ లెండర్లు కిస్తీలు కట్టని వారిని విపరీతంగా సతాయించడంతో భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో ఆర్బీఐ కొన్ని కొత్త రూల్స్ తేవాల్సి వచ్చింది. ఇప్పుడు వీటితో మరో సమస్య వచ్చిపడింది. ఈ యాప్ల ద్వారా ఫేక్ డాక్యుమెంట్లతో చాలా మంది లోన్లు తీసుకుంటున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది సామాన్యులే ఉంటున్నారు. బాధితులకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగత సమాచారం లీక్ కావడంతో వేరే వాళ్లు వీరి పేరుతో లోన్లు తీసుకోగులుగుతున్నారు. ఆర్బీఐ వంటి రెగ్యులేటర్లు ఈ సమస్యపై ఆందోళన చెందుతున్నాయి. తాజాగా ధనిలోన్స్ యాప్ ద్వారా ఇలాంటివి చాలా జరిగాయి. ఇండియాబుల్స్ గ్రూపునకు చెందిన ఈ లెండర్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు తమ డాక్యుమెంట్లతో లోన్లు తీసుకున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అసలు ఇంతకూ ఇలా ఎందుకు జరుగుతుందో... ఏం జరగాల్సి ఉందో తెలుసుకుందాం.
ధనిలో ఏం జరిగింది ?
గుర్తుతెలియని వ్యక్తులు తమ పాన్కార్డు నంబర్లు ఉపయోగించి లోన్లు తీసుకున్నారని గత కొన్ని రోజులుగా ధనీకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. లోన్ కిస్తీలు కట్టాలంటూ తమకు షోకాజు నోటీసులు వచ్చాయని, ఏజెంట్లు వేధిస్తున్నారని కూడా బాధితులు చెబుతున్నారు. ఈ లోన్లతో తమకు సంబంధమే లేదని అంటున్నారు. మరో సమస్య ఏంటంటే ఈ లోన్ల కిస్తీలు కట్టకపోవడం వల్ల పాన్కార్డు హోల్డర్ల క్రెడిట్స్కోర్లు తగ్గుతున్నాయి. డేటా చోరీ, ఫైనాన్షియల్ మోసాలు చిన్న విషయాలు కావు. ఇతరుల డాక్యుమెంట్లతో లోన్లు తీసుకోవడం చాలా పెద్ద నేరం కూడా. కిస్తీలు జమ కాకపోవడంతో ఏజెంట్లు పాన్కార్డు హోల్డర్లను వెంటాడుతున్నారు. దీంతో అసలు సమస్య వెలుగులోకి వచ్చింది. కొందరు బాలీవుడ్ ప్రముఖుల పేరిట కూడా మోసగాళ్లు లోన్లు తీసుకున్నారు.
ధని ఏమంటోంది ?
‘‘కొందరు మోసగాళ్లు దొంగ లోన్లు తీసుకున్నట్టు కంప్లయింట్లు అందిన మాట నిజమే. మేం బాధితులతో మాట్లాడుతున్నాం. వారి వివరాలు తీసుకుంటున్నాం. ఐడెంటిటీ చోరీ జరిగిందా లేదా ? అని నిర్ధారించుకుంటున్నాం. ఫేక్ లోన్ల సమాచారాన్ని క్రెడిట్బ్యూరోలకు ఇస్తున్నాం. మోసగాళ్లు కస్టమర్లతోపాటు కంపెనీలనూ మోసం చేస్తున్నారు. ఇక నుంచి ఇటువంటివి జరగకుండా పటిష్టమైన సిస్టమ్స్ను తీసుకొస్తున్నాం. కొందరు ఓటీపీ, పాస్వర్డ్స్ చెప్పడం వల్ల మోసపోయారు”అని ధని విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మోసగాళ్లను, తప్పుడు పత్రాలను గుర్తించడానికి ధని ‘జీ–డిఫెన్స్’ అనే గ్లోబల్ సెక్యూరిటీ ఫర్మ్తో కలసి పనిచేసినా మోసాలు ఆగలేదు. పాన్కార్డు వివరాలు, ఇతర డాక్యుమెంట్లు లీకయ్యాయి.
ఇతర కంపెనీల్లోనూ..
ధనిలో మాత్రమే కాదు ఇతర సంస్థల్లోనూ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తరువాత వీటి సంఖ్య పెరిగింది. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021లో మోసపూరిత డిజిటల్ ట్రాన్సాక్షన్ల సంఖ్య 28.32 శాతం పెరిగిందని ‘ట్రాన్స్యూనియన్’ రిపోర్టు వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో ఇట్లాంటి కేసులు ఎక్కువ ఉన్నాయని తెలిపింది. డెబిట్/క్రెడిట్కార్డుల మోసాలు విపరీతంగా జరుగుతున్నాయని ఏసీఐ వరల్డ్వైడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ తెలిపింది. రియల్ టైం పేమెంట్స్ స్కామ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2019 నుంచి 2020 మధ్య రియల్ టైం పేమెంట్స్ స్కాములు 12.5 శాతం నుంచి 13.7 శాతం పెరిగాయి. ఐడెండిటీ థెఫ్ట్ కేసులు ఆరు శాతం నుంచి 11.6 శాతం, డిజిటల్ వాలెట్ అకౌంట్ హ్యాక్స్ 4.4 శాతం నుంచి 6.2 శాతం పెరిగాయని పేర్కొంది. బ్యాంక్ ఫ్రాడ్స్ 25 శాతం పెరిగాయని ఆర్బీఐ ప్రకటించింది. ఇటువంటి మోసాలకు అడ్డుకట్టవేయడానికి లెండర్లు ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం ఒక్కటే మార్గమని ఎక్స్పర్టులు చెబుతున్నారు.