బిజినెస్ డెస్క్, వెలుగు: దేశంలో డిజిటల్ పేమెంట్స్ (యూపీఐ, పీఓఎస్, నెట్బ్యాంకింగ్ వంటివి) మరింత పెరగనున్నాయి. రానున్న నాలుగేళ్లలో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ మూడురెట్లకు పైగా పెరుగుతుందని ఫోన్పే–బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కలిసి విడుదల చేసిన రిపోర్ట్ వెల్లడించింది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ 3 ట్రిలియన్ డాలర్లు (రూ. 232 లక్షల కోట్లు) గా ఉండగా, ఈ నెంబర్ 2026 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల (రూ. 775 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని అంచనావేసింది. బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ), గవర్నమెంట్ టూ బిజినెస్ (జీ2బీ) జరిగే పేమెంట్స్ను పైన పేర్కొన్న డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో కలపలేదు. ఇంకో నాలుగేళ్లలో దేశంలో జరిగే ప్రతీ మూడు పేమెంట్ ట్రాన్సాక్షన్లలో రెండు డిజిటల్ ట్రాన్సాక్షన్లే ఉంటాయని ఫోన్పే రిపోర్ట్ అంచనావేసింది. గూగుల్, వాల్మార్ట్ (ఫోన్పే), అమెజాన్ వంటి గ్లోబల్ కంపెనీలు ఎంటర్ అవ్వడంతో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.
టైర్ 1, 2 సిటీల్లోనే ఎక్కువ..
కస్టమర్లు ఈజీగా వాడుకోగలగడం, ఎక్కువ మంది వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్ను అంగీకరిస్తుండడం, కన్జూమర్లలో అవేర్నెస్ పెరుగుతుండడం, డిజిటల్ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగవ్వడంతో దేశంలో డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ వేగంగా పెరుగుతోందని ఫోన్పే రిపోర్ట్ తెలిపింది. ఐఓటీ, 5జీ ,డిజిటల్ రూపాయి వంటివి అందుబాటులోకి వస్తే డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ ఇంకా పెరుగుతుందని అభిప్రాయపడింది. ‘గత కొన్నేళ్ల నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరుగుతుండడం గమనిస్తున్నాం. యూపీఐ ట్రాన్సాక్షన్ల వాల్యూమ్స్ గత మూడేళ్లలోనే తొమ్మిది రెట్లు పెరిగాయి. 2018–19 లో కేవలం 500 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగితే, ఈ నెంబర్ 2021–22 నాటికి 4,600 కోట్లకు ఎగిసింది. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లలో యూపీఐ వాటా 60 శాతానికి పెరిగింది’ అని ఫోన్పే స్ట్రాటజీ హెడ్ కార్తిక్ రఘుపతి అన్నారు. దీనిబట్టి డిజిటల్ పేమెంట్స్కు ప్రజలు అలవాటు పడుతున్నట్టు తెలుస్తోందన్నారు. టైర్ 1, 2 సిటీలలో డిజిటల్ పేమెంట్స్ వాడడం ఎక్కువగా ఉందని, టైర్ 3 నుంచి 6 సిటీలలో విస్తరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.
రూ.10 లక్షల కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు
దేశంలో యూపీఐ ట్రాన్సాక్షన్లు ప్రతీ నెల పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో మొత్తం రూ.10 లక్షల కోట్ల విలువైన పేమెంట్ ట్రాన్సాక్షన్లు యూపీఐ ద్వారా జరిగాయి. ఎన్పీసీఐ డేటా ప్రకారం, ఏప్రిల్లో 558 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరగగా, మే నెలలో 595 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. కిందటేడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే లో యూపీఐ ట్రాన్సాక్షన్ల వాల్యూ 117 % పెరిగింది. 2021–22 ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 77 లక్షల కోట్ల విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. యూపీఐ పేమెంట్లలో ఫోన్పే, గూగుల్పేలు టాప్లో ఉన్నాయి.