లాక్డౌన్ ప్రకటించాక ఇంటికొచ్చిన కీర్తి నాలుగైదు రోజులు ఇంట్లోవాళ్లతో సరదాగానే గడిపింది. ఇప్పుడు మాత్రం ఓ గదిలోకి వెళ్లి లాప్టాప్ ఆన్ చేసుకొని కూర్చుంటుంది. ఇంటర్ పరీక్షలు రాసి.. జేఈఈ మెయిన్స్కు ప్రిపేర్ అయ్యేలోపే కరోనా ముంచుకు రావడంతో ఇంటికి వచ్చిన స్ఫూర్తి కూడా అంతే.. రోజంతా ఫోన్లో ఏదో చూస్తూ గడిపేస్తోంది. కేంద్రీయ విద్యాలయలో చదివే విఘ్నేశ్ కూడా అంతే.. సరిగ్గా పది గంటలకు టిఫిన్ చేసి, డాడీ ఫోన్ తీసుకెళ్లి సోఫాలో కూర్చుంటున్నాడు. అప్పుడప్పుడు నోట్ బుక్ తీసి ఏదో నోట్ చేసుకుంటున్నాడు.
ముగ్గురు పిల్లలు ఇలా రోజంతా ఫోన్ చూస్తున్నా, లాప్టాప్ ముందే కూర్చుంటున్నా పేరెంట్స్ మాత్రం వాళ్లను ఒక్కమాట కూడా అనడం లేదు. ఇదంతా చదివాక వాళ్లింట్లో పిల్లలు ఏం చేస్తున్నారో, పేరెంట్స్ ఎందుకు ఊరుకుంటున్నారో మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆ పిల్లలంతా రోజూ బుద్ధిగా టీచర్స్ చెప్పే పాఠాలు వింటున్నారు. అదీ ఇంట్లో కూర్చుండే.ఇప్పుడంటే లాక్డౌన్ కంటిన్యూ అవుతోంది. కాబట్టి.. స్కూల్కు, కాలేజీకి వెళ్లడం కుదరడంలేదు. అందుకే ఇలా ఆన్లైన్ క్లాస్లను వింటున్నారు. పరిస్థితి మళ్లీ మామూలైపోతే అంతా స్కూల్, కాలేజీలకి వెళ్లిపోతారు. కానీ.. ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా డిజిటల్ స్టోరీ టెల్లింగ్ పద్ధతిలోనే ఉంటుందట.
ఎక్స్పర్ట్స్తో టీచింగ్..
అన్ని స్కూళ్లలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండడం కష్టమే. అందుకే చాలా స్కూళ్లలో టీచింగ్ కోర్సులు చదవని వాళ్లు కూడా టీచింగ్ చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో అయితే ఇంటర్ చదివినవాళ్లు కూడా పాఠాలు చెబుతున్నారు. కానీ డిజిటల్ స్టోరీ టెల్లింగ్లో ఎక్స్పర్ట్స్ మాత్రమే క్లాస్లు చెబుతారు.
లిమిట్ లేకుండా..
క్లాస్లో 50 మందికంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే టీచర్కు క్లాస్ చెప్పడం కష్టమే. కానీ డిజిటల్ స్టోరీ టెల్లింగ్లో అలాంటి సమస్య ఏదీ ఉండదు. ఒక టీచర్ ఎంతమంది స్టూడెంట్స్కైనా పాఠాలు చెప్పొచ్చు. అంటే.. అన్లిమిటెడ్ అన్నమాట.
చదువుకే పరిమితం కాదు..
డిజిటల్స్టోరీ టెల్లింగ్ కేవలం స్కూళ్లకే పరిమితం కావడం లేదు. అన్ని రంగాలకు విస్తరించింది. నచ్చిన అంశమైతే సోషల్మీడియాలో యూజర్లు షేర్ చేస్తుంటారు. దీంతో చూసేవారి సంఖ్య భారీగా పెరుగుతుంది. పోటీ పరీక్షల కోచింగ్, ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ కార్యక్రమాలు.. తదితర రంగాల్లోనూ డిజిటల్ స్టోరీ టెల్లింగ్ దూసుకుపోతోంది.
