శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన చిత్రం ‘పిండం’. డిసెంబర్ 15న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత యశ్వంత్ మాట్లాడుతూ ‘నాకు యూఎస్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. మంచి కథతో సినిమా నిర్మిద్దామని ఇండియాకు వచ్చా. మొదట వేరే కథ అనుకున్నాం. అది కొంత ఆలస్యం అవడంతో.. డైరెక్టర్ సాయి కిరణ్కు ఈ కథ ఆలోచన వచ్చింది.
వారం రోజుల్లోనే మొత్తం స్ర్కిప్ట్ రెడీ చేసి, ‘పిండం’ అనే టైటిల్ చెప్పారు. మొదట టైటిల్ విని ఆశ్చర్యపోయా. అయితే ఒక మనిషి జననంలోనూ, మరణంలోనూ పిండం ఉంటుంది కాబట్టి.. ఆ టైటిల్ పెట్టడంలో తప్పేముంది అనిపించింది. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు. ఇది 1930, 1990తో పాటు ప్రస్తుత కాలాలలో జరిగే కథ.
మొదటి నుంచి చివరి వరకు భయపెడుతూ సాగే కంప్లీట్ హారర్ ఫిల్మ్. చెప్పిన దానికంటే తక్కువ రోజుల్లోనే షూట్ పూర్తవడంతో అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేయగలిగాం. మా మొదటి సినిమా అయినప్పటికీ ఇండియాలో, ఓవర్సీస్లో ఎక్కువ థియేటర్స్లో విడుదల చేస్తున్నాం’ అని చెప్పాడు.
