హోలీ వేడుకల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పండగ సందర్భంగా ఆలయంలో హారతి ఇచ్చే సమయంలో గర్భగుడిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అర్చకులతో సహా 13 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా ఆలయంలోని గర్భగుడిలో 'భస్మ హారతి' ఇచ్చారు అర్చకులు.
ఈ క్రమంలోనే హారతి మంటలు పెరిగి గర్భగుడి మొత్తం వ్యాపించాయి. ఆలయంలోని అర్చకులతో సహా 13 మంది గాయపడ్డారు. స్థానికులు ఆలయంలో నుంచి పొగలు రావడం గమనించి పొలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు మాట్లాడుతూ పూజారి ఆశిష్ శర్మ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకల్లో భాగంగా హారతి ఇచ్చే క్రమంలో ఈ సంఘటన జరిగిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని పోలీసుతు తెలిపారు.