
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క ఫైర్
- సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మండిపాడు
- పంచాయతీరాజ్ పెండింగ్బిల్లులపై సభలో వాడివేడి చర్చ
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్పెండింగ్నిధులపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. మంగళవారం బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పంచాయతీల నిధులపై మాట్లాడారు. నిధులు ఇవ్వడం లేదని, పింఛన్లు రావడం లేదని, పల్లెలు ఆగమైతున్నాయంటూ కామెంట్లు చేశారు. దీంతో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క ఆయనకు గట్టి కౌంటర్ఇచ్చారు. సర్పంచులకు బిల్లులు ఆపిందే గత ప్రభుత్వమని ఎదురుదాడి చేశారు. ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సాకుతో సర్పంచులకు బిల్లులు ఆపుతున్నారని విమర్శించారు.
లోకల్బాడీ ఎన్నికల్లోపు సర్పంచులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం బడ్జెట్లో పంచాయతీరాజ్కు నిధులను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతే.. కాంగ్రెస్ప్రభుత్వం మాత్రం తగ్గిస్తున్నదని ఆరోపించారు. రూరల్ రోడ్స్ నిర్మాణానికి (సీఆర్ఆర్)కు కేవలం రూ.700 కోట్లే కేటాయించారని, అవి ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. రూ.1,100 కోట్లు ఇప్పటికే పెండింగ్ ఉన్నాయని, వాటిని ఎలా ఇస్తారని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు ఏడుస్తున్నాయన్నారు. అందరికీ ఫండ్స్ ఆపేశారని, 8 నెలలుగా ఒక్క రూపాయి రాలేదన్నారు. స్కూళ్లలో పారిశుధ్యం లేదని, వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. దివ్యాంగుల పింఛన్రూ.6 వేలు చేస్తామని దాని ఊసే ఎత్తడం లేదన్నారు. 2014కి ముందు ఎట్లుండే గ్రామీణ వ్యవస్థ.. కేసీఆర్ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో చూడాలన్నారు.
సర్పంచులకు నిధులు ఆపిందే
బీఆర్ఎస్ సర్కార్: శ్రీధర్ బాబు
సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైందే బీఆర్ఎస్ సర్కార్అని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెండింగ్బిల్లులు ఇవ్వట్లేదన్న ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘సర్పంచులు రూ.5 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేయించారు. బిల్లులు పెట్టుకుంటే కొన్నికూడా చెల్లించలేదు. దీంతో బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక ఎందరో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది బీఆర్ఎస్ పాలకులు చేసిన పాపం కాదా? వారు చేసిన పాపాలను మేం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్లు ప్రతి శాఖలోనూ అన్నీ పెండింగ్పెట్టిపోయారు. ఒకదాని తర్వాత ఒకటి బిల్లులను మేం క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. కచ్చితంగా అన్ని బిల్లులు చెల్లిస్తం. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తాం. రుణమాఫీ రెండో విడత పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో హామీలన్నీ అమలు చేస్తాం’’ అని మంత్రి స్పష్టం చేశారు.
పింఛన్లు ఎగ్గొట్టింది బీఆర్ఎస్సే: సీతక్క
సామాజిక పింఛన్లను ఎగ్గొట్టిన ఘనత గత బీఆర్ఎస్ సర్కారుదేనని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘‘2020 జులైలో ఇవ్వాల్సిన పింఛన్ను ఎగ్గొట్టేసి ఆగస్టులో ఇచ్చారు. తర్వాత పింఛన్ను ఎప్పుడూ లేట్గానే ఇచ్చారు. వాళ్ల వల్లే పింఛన్ లేట్గా అందుతున్నది. మేం వచ్చాక ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నాం. కాస్త వెనుకా ముందు అయినా అందరికీ చెల్లిస్తున్నాం. పంచాయతీలకు రూ.370.80 కోట్ల బిల్లులు రిలీజ్ చేశాం. కొన్ని పెండింగ్లో పడ్డాయి. బీఆర్ఎస్ పాలకులే రూ.1,500 కోట్లు పెండింగ్ పెట్టి పోయారు. ప్రస్తుతం పల్లెల్లో పాలనాధికారుల అడ్మినిస్ట్రేషన్ నడుస్తున్నది. బిల్లులన్నింటినీ క్లియర్ చేస్తం. ఆగస్టు 5 నుంచి 13 వరకు అన్ని గ్రామాల్లో ‘స్వచ్ఛదనం పచ్చదనం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం’’ అని ఆమె చెప్పారు.