బహ్రెయిన్ లీగ్ వివాదం: భారత్ తరపున ఆడి అడ్డంగా బుక్కైన పాక్ కబడ్డీ ప్లేయర్!

బహ్రెయిన్ లీగ్ వివాదం:  భారత్ తరపున ఆడి అడ్డంగా బుక్కైన పాక్ కబడ్డీ ప్లేయర్!

ఈ నెలలో బహ్రెయిన్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కబడ్డీ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఆటగాడు ఉబైదుల్లా రాజ్‌పుత్ భారత జట్టు తరపున ఆడినందుకు దీనిపై తీవ్రంగా స్పందించిన పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ (PKF) అతనిపై నిషేధం విధించింది.

ఏం జరిగిందంటే... విదేశాల్లో ఆడటానికి ప్రభుత్వం లేదా ఫెడరేషన్ నుండి తీసుకోవాల్సిన నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లేకుండా రాజ్‌పుత్ బహ్రెయిన్ వెళ్లారు. అలాగే టోర్నమెంట్‌లో ఆయన భారత జట్టు జెర్సీ వేసుకోవడమే కాకుండా, మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జెండాను భుజాలపై వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నిబంధనలు ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ కబడ్డీ ఫెడరేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాజ్‌పుత్‌ను నిషేదించింది. అతనితో పాటు వెళ్లిన మరికొందరు ప్లేయర్లపై కూడా జరిమానా విధించారు. ఈ గొడవపై రాజ్‌పుత్ స్పందిస్తూ అది కేవలం ఒక పొరపాటు అని చెప్పుకొచ్చారు. తనను ఒక ప్రైవేట్ టీమ్ కోసం ఆడమని పిలిచారని, అది 'టీమ్ ఇండియా' అని తనకు ముందుగా చెప్పలేదని అన్నారు.

►ALSO READ | ఇండియా కొడితే మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్‎తో నష్టపోయింది నిజమేనని ఒప్పుకున్న పాక్

సాధారణంగా ఇలాంటి ప్రైవేట్ మ్యాచ్‌లలో భారత్, పాక్ ప్లేయర్స్  కలిసి ఆడటం మామూలేనని, కానీ దేశం పేరుతో ఆడటం తప్పని ఆయన అన్నారు. భారత జెండా కప్పుకోవడం వంటివి తెలియక జరిగిన పొరపాటని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన క్షమాపణలు కోరారు. అయితే రాజ్‌పుత్ తనపై ఉన్న నిషేధాన్ని తొలగించుకోవడానికి క్రమశిక్షణా కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.