
నల్గొండ అర్బన్, వెలుగు : బతుకమ్మ ఆడబిడ్డల పండుగ అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండలోని ఎన్జీ కాలేజీలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాలలో ఆమె పాల్గొని పూజలు చేసి ఆడి, పాడారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మంగళవారం నాగార్జునసాగర్ దగ్గర ఉన్న బుద్ధవనంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఐసీడీఎస్, వ్యవసాయ, పశుసంవర్ధక ,ఉద్యాన, హ్యాండ్లూమ్స్, తదితర శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.