![దివీస్ లాబొరేటరీస్ లాభం రూ.358 కోట్లు](https://static.v6velugu.com/uploads/2024/02/12_DY0K4AjWvw.jpg)
న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ దివీస్ లాబొరేటరీస్ డిసెంబర్ 2023తో ముగిసిన మూడో క్వార్టర్లో రూ. 358 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సంపాదించింది. గత ఏడాది ఇదే కాలంలో పోస్ట్ చేసిన రూ. 306 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 17శాతం పెరిగింది. ఈ హైదరాబాద్ కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9శాతం పెరిగి రూ.1,855 కోట్లకు చేరుకుంది.
గత ఏడాది ఇదే కాలంలో రూ.1708 కోట్లు వచ్చాయి. ఇబిటా రూ. 409 కోట్ల నుంచి రూ. 489 కోట్లకు పెరిగింది. మార్జిన్లు 26.4శాతానికి మెరుగుపడ్డాయి. క్వార్టర్లో పన్నుకు ముందు లాభం (పీబీటీ) రూ. 489 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే క్వార్టర్లో పీబీటీ రూ. 435 కోట్లుగా ఉంది. ఈ క్వార్టర్లో మెటీరియల్ వినియోగం అమ్మకాల ఆదాయంలో దాదాపు 39శాతంగా ఉంది. డిసెంబర్ 2023తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి, కంపెనీ 1,062 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. మార్చి 28, 2024 నుంచి వచ్చే ఐదేళ్లపాటు రెండవసారి స్వతంత్ర డైరెక్టర్గా సునైనా సింగ్ను తిరిగి నియమించడాన్ని కంపెనీ బోర్డు ఆమోదించింది.
అంతేకాకుండా, ఫిబ్రవరి 10 నుంచి 5 సంవత్సరాల కాలానికి 'హోల్-టైమ్ డైరెక్టర్ (తయారీ)'గా నియమితులైన అదనపు డైరెక్టర్గా దేవేంద్రరావు నియామకాన్ని కూడా ఆమోదించింది. మూడవ క్వార్టర్లో మొత్తం ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 5శాతం పెరిగి రూ.1,461 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇవి రూ.1,386 కోట్లు ఉన్నాయి. శుక్రవారం ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్స్ షేర్లు 0.8శాతం నష్టంతో రూ.3,655 వద్ద ముగిశాయి.