న్యూఢిల్లీ: సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) నుంచి రూ. 63 వేల కోట్ల డివిడెండ్స్ను కేంద్రం అందుకుంది. కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, గెయిల్ వంటి కంపెనీలు భారీగా డివిడెండ్స్ చెల్లించాయి. బడ్జెట్లో వేసిన అంచనా కంటే 26 శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల కోట్ల డివిడెండ్ అందుతుందని బడ్జెట్లో కేంద్రం పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ కంపెనీల నుంచి రూ.62,929.27 కోట్ల డివిడెండ్ వచ్చిందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఓఎన్జీసీ రూ.2,964 కోట్లను, కోల్ ఇండియా రూ.2,043 కోట్లను, పవర్ గ్రిడ్ రూ.2,149 కోట్లను, ఎన్ఎండీసీ రూ.1,024 కోట్లను, గెయిల్ రూ. 1,863 కోట్లను డివిడెండ్గా ఇచ్చాయి.