గణేశ్ ఉత్సవాల్లో డీజేతో గుండెపోటు.. నారాయణపేటలో ఒకరు మృతి.. గోదావరిఖనిలో యువకుడు గల్లంతు

గణేశ్ ఉత్సవాల్లో డీజేతో గుండెపోటు.. నారాయణపేటలో ఒకరు మృతి..  గోదావరిఖనిలో యువకుడు గల్లంతు

మహబూబ్ ​నగర్(నారాయణ పేట)​, వెలుగు: నారాయణపేటలో శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే దగ్గర డ్యాన్స్​ చేస్తూ మున్సిపాలిటీ ఔట్​ సోర్సింగ్  ఉద్యోగి శాసన్ పల్లి శేఖర్(45) గుండెపోటుతో చనిపోయాడు. బురుడివాడకు చెందిన శేఖర్​ వాటర్​ సప్లై విభాగంలో పని చేస్తున్నాడు. డీజే దగ్గర డ్యాన్స్​ చేస్తూ కింద పడిపోగా, ఎస్సై వెంకటేశ్వర్లు, మాజీ ఏఎంసీ చైర్మన్  బండి వేణుగోపాల్​ సీపీఆర్  చేసి, ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గోదావరిలో యువకుడు గల్లంతు..

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వద్ద గోదావరిలో యువకుడు గల్లంతయ్యాడు. రామగుండం అక్బర్​నగర్​ కాలనీకి చెందిన రాజేశ్(23) గోదావరిలో కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లాడు. నిద్రమత్తులో ఉన్న రాజేశ్​​ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయాడు. రాజేశ్​ కుటుంబసభ్యులు, సీపీఐ కార్యదర్శి కనకరాజు గోదావరి బ్రిడ్జి వద్ద ఆందోళనకు దిగారు. రాజేశ్​ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నీటి గుంతలో పడి..

మంగపేట, వెలుగు: జయశంకర్​భూపాలపల్లి మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కుంటలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన గార అంజయ్య(54) వినాయక నిమజ్జనం సందర్భంగా బ్యాండ్  కొట్టడానికి బ్రాహ్మణపల్లికి వచ్చాడు. మూత్ర విసర్జనకు వెళ్లిన అతడు సబ్ స్టేషన్  సమీపంలోని నీటిగుంటలో పడి చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీవీఆర్  సూరి తెలిపారు.