- అకౌంట్ ఖాళీ అవుతుంది.. స్టేట్బ్యాంక్ హెచ్చరిక
బిజినెస్ డెస్క్, వెలుగు: మీ కేవైసీ (నో యువర్ కస్టమర్) డిటెయిల్స్ను 10 నిమిషాలలో అప్డేట్ చేయమంటూ లింక్స్తో వచ్చే మెసేజ్లను క్లిక్ చేయొద్దని కస్టమర్లను హెచ్చరిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). కేవైసీ అప్డేషన్ పేరిట కొత్త స్కామ్కు మోసగాళ్లు పాల్పడుతున్నారని సూచించింది. బ్యాంకు రిప్రజెంటేటివ్ని అని చెప్పుకుంటూ మోసగాడు మెసేజ్ పంపించి, ఆ తర్వాత కస్టమర్ల పర్సనల్ డిటెయిల్స్ కొల్లగొడుతున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచీ ఆన్లైన్ మోసాలు జోరందుకున్నాయి. ఎక్కువ మంది ట్రాన్సాక్షన్లను మొబైల్ వ్యాలెట్లు, యూపిఐ వంటి వాటి ద్వారా డిజిటల్గానే చేస్తుండటం మోసగాళ్లకు అనువుగా మారింది. కేవైసీ అప్డేషన్ పేరిట మోసగాళ్లు విసిరే వలలో పడొద్దని, లింక్స్తో అలాంటి మెసేజ్లు వస్తే వెంటనే సైబర్క్రైమ్.జీవోవీ.ఇన్కు రిపోర్టు చేయమని కూడా ఎస్బీఐ సలహా ఇస్తోంది. ఏదైనా లింక్ను క్లిక్ చేసే ముందు మరొక్కసారి ఆలోచించమని సూచిస్తోంది. ఎందుకంటే బ్యాంకు ఎలాంటి లింక్స్ను పంపించదు. ఎవరితోనూ మొబైల్ నెంబర్ను, కాన్ఫిడెన్షియల్ డేటాను షేర్ చేసుకోవద్దని కూడా తమ కస్టమర్లను బ్యాంకు కోరుతోంది.