భూభారతి సదస్సుల్లో పొరపాట్లు జరగొద్దు..రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

భూభారతి సదస్సుల్లో పొరపాట్లు జరగొద్దు..రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి నేటి నుంచి అన్ని  మండలాల్లో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి కలెక్టర్​ సి.నారాయణరెడ్డి తెలిపారు. సదస్సులో ఏమైనా పొరపాట్లు చేస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 సోమవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆర్ఐలతో ఆయన కలెక్టరేట్​ నుంచి టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని కొందుర్గు మండలంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించామన్నారు. అదే తరహాలో జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా సదస్సులు జరపాలని సూచించారు. 

కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విచారణ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ నెల 20 లోపు సదస్సులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు.