
ఇబ్రహీంపట్నం, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి నేటి నుంచి అన్ని మండలాల్లో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. సదస్సులో ఏమైనా పొరపాట్లు చేస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సోమవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆర్ఐలతో ఆయన కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని కొందుర్గు మండలంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించామన్నారు. అదే తరహాలో జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా సదస్సులు జరపాలని సూచించారు.
కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విచారణ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ నెల 20 లోపు సదస్సులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు.