
- మున్సిపల్ కార్పొరేషన్లలో పెరిగిన డివిజన్లు
- జగిత్యాల మున్సిపాలిటీలో వార్డులు 48 నుంచి 50కి పెంపు
- ముసాయిదా ప్రతిపాదనలు రిలీజ్ చేసిన మున్సిపల్ శాఖ
కరీంనగర్/గోదావరిఖని, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను 60 నుంచి 66 డివిజన్లుగా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను 50 నుంచి 60 డివిజన్లుగా పునర్విభజన చేస్తూ మున్సిపల్ శాఖ ముసాయిదాను మంగళవారం విడుదల చేసింది. అలాగే 48 వార్డులున్న జగిత్యాల మున్సిపాలిటీలో 50కు పెంచారు. ఉమ్మడి జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఒక మున్సిపాలిటీలో ముసాయిదాపై ఈ నెల 5 నుంచి 11 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. 12 నుంచి 16 వరకు వాటిని పరిశీలిస్తారు. 17, 18 తేదీల్లో డివిజన్ల విభజనకు కలెక్టర్ అనుమతి తీసుకోనున్నారు. 19న ముసాయిదా జాబితాను సీడీఎంఎకు పంపిస్తారు. 20న సీడీఎంఏ నుంచి ప్రభుత్వానికి నివేదికను పంపి, 21న డివిజన్ల ఫైనల్ జాబితాను విడుదల చేస్తారు.
కరీంనగర్లో ఒక్కో డివిజన్లో 4,800 నుంచి 5,200 మంది ఓటర్లు..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, దుర్శేడు, గోపాల్పూర్, కొత్తపల్లి మండలంలోని చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలను కార్పొరేషన్లో విలీనమైన విషయం తెలిసిందే. 2018లో అల్గునూర్, సదాశివపల్లి, పద్మానగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ వంటి 8 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా డివిజన్ల సంఖ్యను 50 నుంచి 60కి పెంచగా.. తాజాగా ఒక పట్టణం, ఆరు గ్రామాల విలీనంతో డివిజన్ల సంఖ్యను 66కు పెంచారు. ఏడేళ్లలో కరీంనగర్లో 16 డివిజన్లు పెరిగాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక్కో డివిజన్ లో 4,800 నుంచి 5,200 వరకు ఓటర్లు ఉండేలా డివిజన్లు విభజించారు.
రామగుండంలో 60 డివిజన్లు..
రామగుండం కార్పొరేషన్లో రామగిరి మండలం వెంకట్రావుపల్లి, అంతర్గాం మండలం లింగాపూర్, ఇదే మండలంలోని కుందనపల్లి విలేజ్లో ఉన్న అక్బర్నగర్, పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి గేట్ గ్రామాలు విలీనమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం 50 డివిజన్లతో కూడిన రామగుండం కార్పొరేషన్ ను 60 డివిజన్లుగా పునర్విభజన చేశారు. నాలుగు గ్రామాల నుంచి సుమారు 8 వేల నుంచి 10 వేల ఓటర్లు చేరగా కార్పొరేషన్లో ఓటర్ల సంఖ్య 1.90 లక్షలకు చేరుకోనుంది. దీంతో ప్రస్తుతం అర్బన్లో ఉన్న కొన్ని డివిజన్లలో ఎక్కువగా ఉన్న ఓటర్లను తగ్గించి ఇతర డివిజన్లలో చేర్చుతున్నారు. ఇలా ఒక్కో డివిజన్లో 3,100 నుంచి 3,500 ఓటర్ల వరకు మాత్రమే ఉండేలా చూస్తున్నారు. డివిజన్లలో ఓటర్ల సంఖ్య తగ్గడంతోపాటు వాటి హద్దులు కూడా మారనున్నాయి.