100 కోట్ల విలువైన 20 ఎకరాల సీలింగ్​ ల్యాండ్​ ..ప్లాట్లుగా అమ్మేసిన్రు

100 కోట్ల విలువైన 20 ఎకరాల సీలింగ్​ ల్యాండ్​ ..ప్లాట్లుగా అమ్మేసిన్రు
  •  
  • 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్​ కలెక్టర్ పమేలా
  • రెవెన్యూ, రిజిస్ట్రేషన్​ శాఖల నిరక్ష్యానికి సామాన్యులు బలి
  • ఈ భూమి విలువ దాదాపు రూ.100 కోట్లు
  • ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో పెడితే నష్టపోయే వాళ్లంకాదని 
  • బాధితుల ఆవేదన.. బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లు, 
  • రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ జిల్లాలో 476 అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగు చూశాయి. కొత్తపల్లి హవేలీ పరిధిలో సర్వే నంబర్లు 175, 197, 198 లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు తేలింది. దీని విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమిపై 1995 నుంచి కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ, అధికారులు నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్లు కొనసాగించారు. ఈ వ్యవహారం లోకాయుక్త దృష్టికి వెళ్లడంతో, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అవి ప్రభుత్వ భూములని తెలియక కొనుగోలు చేసిన 476  మంది ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అసలు ముందే ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టి ఉంటే తాము ఆ భూములు కొనుగోలు చేసేవాళ్లమే కాదని, కేవలం రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా రూ.కోట్లు మునిగామని అందులో ప్లాట్లు కోల్పోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీలింగ్ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి కరీంనగర్ రూరల్, గంగాధర సబ్ రిజిస్ట్రార్లు, నాడు మౌనం వహించిన రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 రోడ్డున పడ్డ బాధితులు 

కరీంనగర్ సిటీకి సమీపాన కొత్తపల్లి రెవెన్యూ విలేజీ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలోని భూమిపై 3 దశాబ్దాలుగా వివాదం ఉంది. 1995లోనే ఈ వివాదం హైకోర్టుకు చేరింది. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్‌‌‌‌ విచారణ జరిపించి అవి సీలింగ్‌‌‌‌భూములని తేల్చినట్లు తెలిసింది. దీంతో ఆ భూమిని క్లెయిమ్ చేస్తున్న వారు మళ్లీ అప్పీల్ కు వెళ్లగా.. విచారణలో ఉండగానే ఈ భూములు ముగ్గురి చేతులు మారాయి. 2004లో ఇద్దరు రియల్‌‌‌‌ ఎస్టేట్ వ్యాపారులు ఆ వివాదాస్పద భూమిని కొనుగోలు చేసి,  ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. కరీంనగర్ కు అత్యంత సమీపంలో, కరీంనగర్ - జగిత్యాల హైవేలో ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా మంది ఇందులో ప్లాట్లు కొనుక్కున్నారు. 476 ప్లాట్లు రిజిస్టర్​ అయ్యాయి. 2015లో లోక్ సత్తా ఉద్యమ సంస్థ నేత నరెడ్ల శ్రీనివాస్ లోకాయుక్తలో కేసు వేయడం, విచారించిన లోకాయుక్త నిరుడు ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ తీర్పునివ్వడంతో ప్లాట్లు కొనుగోలు చేసినవాళ్లలో ఆందోళన మొదలైంది. పైసాపైసా కూడబెట్టి పిల్లల పెళ్లిళ్లు, చదువులు, సొంతింటి నిర్మాణం కోసం కొనుక్కున్న ప్లాట్లు రద్దు కావడంతో లబోదిబోమంటున్నారు. 

ఆ బాధ్యత ఎవరిది ? 

అసైన్డ్, సీలింగ్, ప్రభుత్వ భూములు, వక్ఫ్​, దేవాదాయ శాఖ భూములతోపాటు కోర్టు స్టే ఉన్న భూములను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ 22ఏ కింద ప్రొహిబిటెడ్ జాబితాలో చేరుస్తుంది. ఇలా ఆ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉండటంతో ఎలాంటి క్రయ, విక్రయాలు చేయడానికి కుదరదు. ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చాల్సిన భూముల వివరాలను ఆయా ఆర్డీవోలు, కలెక్టర్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు పంపిస్తుంటారు. కానీ కొత్తపల్లి పరిధిలోని  175, 197, 198 సర్వే నంబర్లలోని భూమిపై 1995 నుంచి వివాదం ఉన్నప్పటికీ ఆ భూముల సర్వే నంబర్లను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చలేదు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు ఆపడానికి అవకాశం లేకుండాపోయింది. 

సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలుండవా ? 

2016 వరకు కరీంనగర్‌‌‌‌ రూరల్‌‌‌‌సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 424 రిజిస్ట్రేషన్లు కాగా, గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటయ్యాక 2‌‌‌‌024 నవంబర్ వరకు 52  అయ్యాయి. 2005 నుంచి నిరుడు వరకు పనిచేసిన కరీంనగర్ రూరల్, గంగాధర సబ్ రిజిస్ట్రార్లు కాసులకు కక్కుర్తిపడి ఉద్దేశపూర్వకంగానే  సీలింగ్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ కేసు విచారణను తొక్కిపెట్టి యథేఛ్చగా రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్లు రద్దు చేసిన జిల్లా అధికారులు బాధ్యులైన అప్పటి సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోక పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.