పడిపోయిన బేబీ పల్స్.. డెలివరీని మధ్యలో ఆపిన డాక్టర్లు!

పడిపోయిన బేబీ పల్స్.. డెలివరీని మధ్యలో ఆపిన డాక్టర్లు!

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలో బేబీ పల్స్​పడిపోయిందని డాక్టర్లు సిజేరియన్​ను మధ్యలో ఆపేయడంతో తల్లి కడుపులోనే శిశువు మృతి చెందింది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ చెందిన మంద వింధ్య నిండు గర్భిణి. డెలివరీ కోసం ఈనెల14న స్థానిక కమలా నెహ్రూ హాస్పిటల్​లో అడ్మిట్​అయింది. 

పురిటి నొప్పులు మొదలవడంతో నార్మల్​ డెలివరీ అవుతుందని, సిజేరియన్​అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. 15న ఎంతకీ నార్మల్​ డెలివరీ కాకపోవడంతో డాక్టర్లు సీజేరియన్ ​స్టార్ట్ ​చేశారు. ఈ క్రమంలో తల్లి కడుపులోని బేబీ పల్స్ రేట్​పడిపోయిందంటూ, ఆపరేషన్​ను మధ్యలోనే ఆపారు. వేరే హాస్పిటల్​కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. 

వెంటనే నల్గొండ ఏరియా హాస్పిటల్ కి తరలించగా, అక్కడి డాక్టర్లు డెలివరీ చేశారు. పాప పుట్టగా, కొద్దిసేపటికే మృతి చెందింది. వింధ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో వింధ్య కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం పాప డెడ్​బాడీతో నాగార్జునసాగర్​కమలా నెహ్రూ హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యమే పాప మృతికి కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చచెప్పటంతో ధర్నా విరమించారు. 

ఈ విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ భానుప్రకాశ్​​ వివరణ కోరగా.. ఈ నెల14న వింధ్య డెలివరీ కోసం వచ్చిందని, డాక్టర్లు పరీక్షించి ఆపరేషన్ చేయాలనగా, వింధ్య బంధువులు నార్మల్ డెలివరీ చేయాలని కోరినట్లు తెలిపారు. టైం తీసుకుంటే కడుపులోని బిడ్డకు ప్రమాదం అని చెప్పినా వినలేదన్నారు. నార్మల్ డెలివరీ చేస్తున్న క్రమంలో బేబీ బయటకు రావడంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని, సరైన ఎక్విప్​మెంట్​లేకపోవడంతో మరో హాస్పిటల్​కు  పంపించామన్నారు.