- కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్నిబహిష్కరిస్తున్నం
- 19 ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రకటన
- ప్రధాని మోడీతో ఓపెనింగ్ను వ్యతిరేకిస్తున్నామని వెల్లడి
- సావర్కర్ జయంతి రోజు ప్రారంభోత్సవం ఏమిటని విమర్శ
- రాష్ట్రపతి చేతుల మీదుగా చేపట్టాలని డిమాండ్
- రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు అమిత్ షా హితవు
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం రాజకీయ రగడకు దారితీసింది. ఈ వేడుకను తాము బహిష్కరిస్తున్నట్లు 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలనుకోవడం ఏమిటని, రాష్ట్రపతితో చేయించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం సంయుక్తంగా ప్రెస్నోట్ రిలీజ్ చేశాయి. ప్రధాని మోడీ చేసే ప్రారంభోత్సవానికి తాము రాలేమంటూ తేల్చిచెప్పాయి. ప్రతిపక్షాల విమర్శలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ‘‘నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ప్రతిఒక్కరినీ ఆహ్వానించాం. రావడం, రాకపోవడంపై నిర్ణయం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని కోరుతున్నాం” అని ఆయన అన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా మోడీ బంగా రు రాజదండాన్ని (సెంగోల్) స్పీకర్ కుర్చీ పక్కన ఆవిష్కరిస్తారని వెల్లడించారు. 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం : ప్రతిపక్షాలు
వీర్ సావర్కర్ జయంతి రోజున పార్లమెంట్ భవ నం ఓపెనింగ్ దేనికి సంకేతం అని 19 ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. ‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పూర్తిగా పక్కనపెట్టి తానే స్వయంగా పార్లమెంట్ బిల్డింగ్ను ప్రారంభించాలనుకున్న మోడీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుంది. ఈ చర్య రాష్ట్రపతి అత్యున్నత పదవిని, రాజ్యాంగ స్ఫూర్తిని వ్యతిరేకించడమే’’ అని విమర్శించాయి. రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళను అవమానిస్తున్నారని మండిపడ్డాయి. రాష్ట్రపతితో పార్లమెంట్ భవనం ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశారు.
బహిష్కరించిన పార్టీలు ఇవే..
కాంగ్రెస్, ఆప్, డీఎంకే, రాష్ట్రీయ జనతా దళ్, శివసేన (ఉద్దవ్ వర్గం), ఎన్సీపీ, జేడీయూ, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుతలై చిరుతైగల్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం.
మీ విజ్ఞతకే వదిలేస్తున్న: అమిత్షా
ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటనపై హోంమంత్రి అమి త్ షా స్పందించారు. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి అన్ని పార్టీలను ఆహ్వానించామని తెలిపారు. ఉభయ సభల ఎంపీలకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలకు ఇతర నేతలకు ఇన్విటేషన్లు పంపించామన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడంపై నిర్ణయం వారి విజ్ఙతకే వదిలేస్తున్నామన్నారు.
డిసైడ్ కాని బీఆర్ఎస్.. అటెండ్ కానున్న టీడీపీ, వైసీపీ
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాలా.. లేక బహిష్కరించాలా.. అనేదానిపై గురువారం నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మీడియాకు తెలిపారు. ఏపీలోని టీడీపీ, వైసీపీ ఈ ప్రోగ్రామ్కు హాజరు కాబోతున్నట్లు ప్రకటించాయి. పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్, ఒడిశా అధికార పార్టీ బీజేడీ అటెండ్ అవుతున్నాయి.
రాష్ట్రపతిని అవమానిస్తున్నరు : రాహుల్
పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభించాలని రాహుల్ డిమాండ్ చేశారు. మోడీతో పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం సరికాదన్నారు. ఇది రాష్ట్రపతిని అవమానించడమే అవుతుందని విమర్శించారు. కనీసం రాష్ట్రపతిని ఇన్వైట్ కూడా చేయలేదన్నారు.
మేమెందుకు చేయొద్దు? : హర్దీప్ సింగ్ పూరి
కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలను కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి గుర్తు చేశారు. పార్లమెంటు అను బంధ భవనాన్ని 1975 అక్టోబరు 24న ఆనాటి ప్రధాని ఇందిరా ప్రారంభించారని, ఆమె కొడుకు రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్న ప్పుడు 1987 ఆగస్టు 15న పార్లమెంట్ లైబ్రరీకి శంకుస్థాపన చేశారని వివరిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వాధినేత ప్రారంభించినప్పుడు, ఎన్డీయే ప్రభు త్వాధినేత ఇప్పుడు అదే పని ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించారు.
బాయ్కాట్పై మాట్లాడను : గులాం నబీ ఆజాద్
కొత్త పార్లమెట్ భవనాన్ని నిర్మించాలనే ఆలోచన ముందుగా పీవీ నరసింహారావుకు వచ్చిందని డీపీఏపీ చీఫ్ గులాం నబీ ఆజాద్ గుర్తు చేశారు. పీవీ హయాంలోని ప్రభుత్వమే ప్రతిపాదిం చిందని తెలిపారు. తర్వాత కొన్ని కారణా లతో ఈ ప్రతిపాదన కాస్త కోల్డ్స్టోరేజీలోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ‘‘కొత్త పార్ల మెంట్ నిర్మించుకోవడం బాగుంది. ప్రతి పక్షాల బాయ్కాట్పై నేనేం మాట్లాడను. అటెండ్ కావాలా.. బహిష్కరించాలా వారి ఇష్టం”అని గులాం నబీ ఆజాద్ అన్నారు.