నారాయణపేట, వెలుగు : రూ.18 లక్షలు అప్పు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ఆ బిల్లులు ఇవ్వకుండా సతాయిస్తున్నారని, వెంటనే పైసలివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం దోరేపల్లి సర్పంచ్ చంద్రకళ డీపీఓ ఆఫీసులో ఆందోళన చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. భర్తతో కలిసి బైఠాయించిన సర్పంచ్ మాట్లాడుతూ పనులు చేసి ఏడాదిన్నరవుతున్నదని, ఎప్పుడూ ఏదో వంకతో అధికారులు తప్పించుకుంటున్నారన్నారు. అన్నీ రెడీ చేస్తే 4 నెలలు ట్రెజరీ ఫ్రీజింగ్అని ఆపారని, తరువాత చెక్పై సంతకం చేయకుండా ఉప సర్పంచ్ రాములమ్మ తిప్పలు పెట్టిందన్నారు. తాను కాంగ్రెస్ సర్పంచ్అయినందున ఎమ్మెల్యే కావాలనే ఇలా చేయిస్తున్నాడని ఆరోపించారు. తనను టీఆర్ఎస్లో చేరాలని బెదిరిస్తున్నారన్నారు. సస్పెండ్చేస్తామని పనులు చేయించారని, బిల్లులు అడిగితే వాయిదాలు వేస్తున్నారన్నారు.
సంతకాలు చేయకపోవడంతో..
ఉపసర్పంచ్ చెక్లపై సంతకాలు చేయకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే అడిషనల్కలెక్టర్కు పంపించి విచారణ చేయిస్తానని చెప్పారని, ఇంతవరకూ చేసిందేమీ లేదన్నారు. బిల్లులు ఇచ్చే వరకు బయటికి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. డీపీఓ మురళి బయట ఉండడంతో చంద్రకళతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా సర్పంచ్వినలేదు. కొద్దిసేపటి తర్వాత డీపీఓ రాగా సర్పంచ్, ఆమె భర్త ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఉపసర్పంచ్పై విచారణ చేయాలని మద్దూర్ ఎంపీడీఓను ఆదేశించామని, రిపోర్టు రావాల్సి ఉందన్నారు. అయితే ఆయన రిపోర్ట్ పంపానని చెప్పాడని, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని, కాళ్లు మొక్కుతామని డీపీఓ వెంటపడ్డారు. డీఎల్పీఓను మంగళవారం విచారణకు పంపిస్తామని, రిపోర్టు వచ్చాక బిల్లులు పాస్ చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి పంపించారు.