సాధారణంగా మనం పుచ్చకాయ తిన్నాక లోపల ఉండే తెల్లటి భాగాన్ని పారేస్తుంటాం. కానీ, దాంతో ఎంతో రుచికరమైన, కరకరలాడే దోశలు వేసుకోవచ్చని మీకు తెలుసా? దీనినే 'వాటర్ మెలన్ దోశ' అంటారు. ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
అల్లం, పచ్చిమిర్చి, మిరియాల పొడి ఘాటుతో.. పుచ్చకాయలోని చల్లదనంతో కలిపి చేసే ఈ దోశలు బ్రేక్ఫాస్ట్లోకి ఒక కొత్త వెరైటీగా ఉంటాయి. మరి ఎప్పుడూ తినే మామూలు దోశలు కాకుండా, ఈసారి ఈ హెల్తీ అండ్ టేస్టీ పుచ్చకాయ దోశను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామా....
కావలసిన పదార్థాలు:
బియ్యం : ఒక కప్పు
పుచ్చకాయ తురుము : రెండు కప్పులు (పుచ్చకాయలోని తెల్లని భాగం)
పచ్చిమిర్చి: రెండు,
జీలకర్ర: ఒక టీ స్పూన్
ఇంగువ: చిటికెడు
నల్ల మిరియాల పొడి : కొంచెం
ఉప్పు: రుచికి సరిపడా,
నూనె: తగినంత
తయారీ
ముందుగా బియ్యం కడిగి రెండు, మూడు గంటలు నానబెట్టాలి. పుచ్చకాయలో తెల్లని పదార్థాన్ని తురిమి... నీళ్లుపిండి పక్కన పెట్టాలి. నానబెట్టిన బియ్యంతో పాటు పచ్చిమిర్చి, ఇంగువ, పుచ్చకాయ తురుము కలిసి మెత్తటి పేస్ట్ లా చేయాలి. ఇందులో నల్ల మిరియాల పొడి కావాల్సినంత వేసి కలపాలి. ఈ దోశ పిండిని నాలుగు గంటలు పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దోశపిండి వేయాలి. దోశను రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకుంటే.. వేడి వేడి వాటర్ మెలన్ దోశ రెడీ.
