న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు కొత్త వేవ్కు సూచిక కాదని, థర్డ్ వేవ్లో భాగంగా నమోదవుతున్న కేసులని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్టీఏజీఐ) చైర్మన్ డాక్టర్ ఎన్కే ఆరోరా తెలిపారు. కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేస్తున్నదని చెప్పారు. పెరుగుతున్న కేసులు, పాజిటివిటీ రేటు ముఖ్యం కాదని, హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య పెరగడం లేదన్నారు. ఈ మధ్య కాలంలో తక్కువగానే కరోనా కేసులు నమోదవుతున్నాయని, నాలుగైదు రోజుల్లోనే సింప్టస్ నయమైపోతున్నాయని చెప్పారు. కరోనా కారణంగా హాస్పిటళ్లల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరగడం లేదని, దీంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. హాస్పిటల్స్లో అడ్మిషన్లు, వైరస్ మరణాలు ఎక్కువగా వృద్ధులు, కొమొర్బిడిటీ ఉన్న రోగుల్లోనే ఉన్నాయని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్బీబీ.1.16 కారణంగానే ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయని, ఇందులోనూ సబ్ వేరియంట్లు ఉన్నాయని అరోరా వెల్లడించారు. గత 15 నెలల్లో దాదాపు 450 మ్యుటేషన్లను కనిపించాయని తెలిపారు. కాగా, అందరికీ బూస్టర్ డోస్ అవసరమని, ముఖ్యంగా పెద్దవాళ్లు వీలైనంత తొందరగా బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరారు. గత మూడేండ్లుగా చిన్నారులు చాలా తక్కువగా వైరస్ బారిన పడుతున్నారని, వారికి వైరస్ సోకినా లక్షణాలు కనిపించట్లేదన్నారు. ఇప్పటివరకు 12 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు 90% మంది వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు.
దేశంలో కొత్త కేసులు 5,676..
దేశంలో కొత్తగా 5,676 కరోనా కేసులు నమోదయ్యాయని హెల్త్ మినిస్ట్రీ మంగళవారం వెల్లడించింది. వైరస్తో మరో 21 మంది చనిపోయారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,000కు పెరిగిందని వెల్లడించింది. డైలీ పాజిటివిటీ రేటు 2.88 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.81 శాతం, డెత్ రేటు 1.19 శాతంగా ఉందని తెలిపింది. యాక్టివ్ కేసులు 37,093కు పెరిగాయని పేర్కొంది. ఇప్పటివరకు 4,42,00,079 మంది వైరస్ నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 98.73 శాతంగా ఉందని వెల్లడించింది.