న్యూఢిల్లీ: కరోనా కారణంగా దాదాపు రెండేళ్లపాటు పెద్దగా హడావుడిగా లేకుండానే చాలా మంది పెళ్లి చేసుకున్నారు. ఈ మహమ్మారి పీడ దాదాపు తొలగిపోవడంతో మునుపటి జోష్ మళ్లీ వచ్చింది. ఈ ఏడాది వెడ్డింగ్ సర్వీసులకు గిరాకీ ఎక్కువయింది. ఫంక్షన్హాల్స్ కోసం ఎంక్వైరీలు 68 శాతం, వంటవాళ్ల కోసం ఎంక్వైరీలు 57 శాతం పెరిగాయి. నగల కొనుగోళ్ల కోసం ఆన్లైన్ లో సెర్చ్లు 44 శాతం అధికమయ్యాయి. రిలయన్స్ రిటైల్కు చెందిన ‘జస్ట్డయల్’ స్టడీ రిపోర్టు ద్వారా ఈ వివరాలు తెలిశాయి. భారతదేశంలోని 1,000 పట్టణాలు, నగరాల్లో ఫంక్షన్ హాళ్లు, క్యాటరర్లు, డెకరేటర్లు, డీజేలు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వెడ్డింగ్ జువెలర్లు, టైలర్లు, మెహందీ ఆర్టిస్టులు, పురోహితులు, ఫోటోగ్రాఫర్లు, మ్యాట్రిమోనియల్ బ్యూరోలు, వెడ్డింగ్ బ్యాండ్లు వంటి వివాహ సేవలకు జస్ట్డయల్ ప్లాట్ఫారమ్లో ఎంక్వైరీలు 30 శాతం పెరిగాయి.
టైర్–2 సిటీల్లో డిమాండ్ 48 శాతం, టైర్–1 సిటీల్లో డిమాండ్ 22 శాతం పెరిగిందని జస్ట్ డయల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రసూన్ కుమార్ చెప్పారు. రాబోయే నెల రోజుల్లో దేశంలో 32 లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని, కరోనా కారణంగా పరిమితులు విధించడంతో గత రెండేళ్లుగా వెడ్డింగ్ సర్వీసుల ఆపరేటర్లు ఇబ్బందులు పడ్డారని వివరించారు. మనదేశంలో అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు పెళ్లిళ్లు చాలా కీలకమని, టైర్–2 సిటీల్లో వీటి సంఖ్య పెరుగుతుండటం మంచి విషయమని కుమార్ అన్నారు. టైర్–1 సిటీల కంటే ఈ సిటీల్లో వెడ్డింగ్ సర్వీసులకు డిమాండ్ రెండు రెట్లు ఎక్కువగా ఉందని వివరించారు.
ఈ ఐదు సేవలకు ఫుల్లు గిరాకీ..
ఆభరణాలు, బాంకెట్ హాల్స్, డెకరేటర్లు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరర్లకు అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. ఈ ఐదింటికి సంబంధించిన సేవల కోసమే 60 శాతం ఎంక్వైరీలు జరిగాయి. పెళ్లిళ్ల నగల కోసం ముంబై నుంచి అత్యధిక డిమాండ్ కనిపించగా, తర్వాత ఢిల్లీ, హైదరాబాద్ ఉన్నాయి. టైర్–-1 నగరాల్లో వీటికోసం సెర్చ్లు 29శాతం పెరిగాయి. టైర్-–2 నగరాల్లో 44శాతం పెరిగాయి. టైర్-–2 నగరాల్లో జైపూర్ నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండగా, తర్వాత సూరత్, రాజ్కోట్, చండీగఢ్ కోయంబత్తూర్ ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన మిగతా సర్వీసుల కంటే ఫంక్షన్ హాల్స్ కోసం సెర్చ్లు 68 శాతం పెరిగాయి. టైర్–2 నగరాల్లో ఈ డిమాండ్ 83 శాతం పెరిగింది. టైర్–1 నగరాల్లో 46 శాతం పెరిగింది.
ఫంక్షన్ హాళ్ల సెర్చ్లలో ముంబై మొదటిస్థానంలో ఉంది. టైర్–1 నగరాల నుంచి డిమాండ్లో దాదాపు 27శాతం ఈ సిటీ నుంచే ఉంది. ఢిల్లీ, చెన్నై వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. తరువాతిస్థానాల్లో కోయంబత్తూర్, సూరత్, నాగ్పూర్, లక్నో పాట్నా ఉన్నాయి. టైర్–1 సిటీలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో డెకరేటర్ల కోసం సెర్చ్లు 31శాతం పెరిగాయి. చండీగఢ్, ఇండోర్, జైపూర్, లక్నో, సూరత్ వంటి నగరాల్లో డిమాండ్ 43శాతం పెరిగింది. ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ 23శాతం పెరిగింది.ఈ విషయంలో టైర్-–2 నగరాల్లో సెర్చ్లు టైర్-–1 నగరాల కంటే 2.3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. టైర్-–1 నగరాల డిమాండ్లో దాదాపు 50శాతం వాటా ముంబై, ఢిల్లీల నుంచే ఉంది.