12 గంటలు తిరుమల ఆలయం మూసివేత : కొండకు వెళ్లేవాళ్లు మీ షెడ్యూల్ మార్చుకోండి..!

12 గంటలు తిరుమల ఆలయం మూసివేత : కొండకు వెళ్లేవాళ్లు మీ షెడ్యూల్ మార్చుకోండి..!

తిరుమల : ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 అంటే ఆదివారం రాబోతుంది. దింతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని దేవాలయాల మూసివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత దేవాలయాలను శుద్ధి చేసి దర్శనం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 నుంచి  తరువాత రోజు  తెల్లవారుజామున అంటే సెప్టెంబర్ 8న 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుమారు 12గంటలపాటు  పాటు మూసివేయనున్నారు.

చంద్రగ్రహణం సమయం: సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టంబర్‌ 8న సోమ‌వారం వేకువ‌జామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. 

టీటీడీ దర్శనం సమయాలు: హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో దేవాలయాలను పూర్తిగా మూసివేస్తారు. ఎందుకంటే గ్రహణ సమయంలో పూజలు నిర్వహించడం అశుభకరమైనదని భావిస్తారు. దీంతో పెద్ద పెద్ద దేవాలయాల నుంచి చిన్న దేవాలయాల వరకు గ్రహణ సమయంలో మూసివేస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీవారి ఆలయం మూసి వేయనున్నారు. చంద్రగ్రహణం వీడిన అనంతరం సాంప్రదాయం ప్రకారంగా సెప్టంబ‌ర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. 

కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి  దర్శనం భక్తులకు తిరిగి ప్రారంభవుతుంది. చంద్రగ్రహణం కారణంగా సెప్టంబ‌ర్ 7వ‌ తేదీ ఆదివారం  ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసినట్లు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.

టీటీడీ అన్నప్రసాదం సమయాలు : చంద్రగ్రహణం కారణంగా సెప్టంబ‌ర్ 7న ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ వుండదని, తిరిగి  సెప్టంబ‌ర్ 8వ తేది ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పున: ప్రారంభమవుతుందని టిటిడి తెలిపింది. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 ల‌లో అన్నప్రసాదాల వితరణ ఉండదు. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుండి పంపీణి చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీ‌వారి ఆల‌యం ఎదురుగా ఉన్న వైభ‌వోత్స‌వ మండ‌పం, రామ్ భ‌గీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంట‌ర్లు, శ్రీ‌వారి సేవా స‌ద‌న్ వ‌ద్ద‌ భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు. శ్రీ వారి భక్తులు ఈ విషయాలను గమనించి తిరుమల యాత్ర ప్రణాళికను  రూపొందించుకోవాలని టిటిడి కోరింది.

టీటీడీ బ్రేక్ దర్శనాలు:  చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టిటిడి. సెప్టెంబర్ 8న దర్శనం కోసం  7వ తేదిన వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవవి టిటిడి తెలిపింది. 8వ తేది నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనున్నారు. అదేవిధంగా 7వ తేదిన శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేసినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.