
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ స్ప్రింటర్, ఆసియా గేమ్స్ డబుల్ సిల్వర్ మెడలిస్ట్ ద్యుతీ చంద్ షాకింగ్ విషయాన్ని చెప్పింది. తాను క్యాన్సర్ బారిన పడినట్టు శుక్రవారం వెల్లడించింది. 2021 నవంబర్లో ఈ విషయం తనకు తెలిసిందని చెప్పింది. డాక్టర్లు తన శరీరంలో లెవెల్1 క్యాన్సర్ను గుర్తించారని తెలిపింది. ‘టోక్యో ఒలింపిక్స్కు ముందు నేషనల్ ఇంటర్ స్టేట్ ఈవెంట్లో పోటీ పడుతుండగా గజ్జల్లో విపరీతమైన నొప్పి వచ్చింది. డాక్టరుకు చూపెట్టినా నొప్పి తగ్గలేదు. ఇబ్బందిగానే ఒలింపిక్స్కు వెళ్లి నిరాశ పరిచా. టోక్యో నుంచి తిరిగొచ్చాక ఎంఆర్ఐ స్కాన్ చేసి డాక్టర్ సుదీప్ నా శరీరంలో లెవెల్1 క్యాన్సర్ మొదలైందని చెప్పారు. స్పోర్ట్స్ ఆపేయకుంటే అది ప్రమాదకరంగా మారుతుందన్నారు. గతంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇన్ బ్యాలెన్స్తో నేను ఇబ్బంది పడ్డా. దాని కారణంగానే క్యాన్సర్ ఎటాక్ అయింది. . డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడి 20 రోజులు రెస్ట్ తీసుకోవడంతో నొప్పి తగ్గింది’ అని ద్యుతీ చెప్పుకొచ్చింది. క్యాన్సర్ను రీకన్ఫామ్ చేసేందుకు మరోసారి టెస్టు చేయించుకోలేదని తెలిపింది.
నాడా నాలుగేండ్ల బ్యాన్పై అప్పీల్కు
గతేడాది డిసెంబర్లో ద్యుతీ నుంచి సేకరించిన శాంపిల్స్లో నిషేధిత డ్రగ్స్ను గుర్తించిన యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆమెపై నాలుగేండ్ల బ్యాన్ విధించింది. ఈ బ్యాన్ను ద్యుతీ సవాల్ చేస్తుందని ఆమె లాయర్ తెలిపారు. డోపింగ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక తాను మరింత కుంగిపోయానని ద్యుతీ చెప్పింది. తాను తీసుకున్న మెడిసిన్స్ వివరాలను మెడికల్ ఎక్స్పర్ట్స్కు పంపించానని వెల్లడించింది.