
- ఖుద్స్ ఫోర్స్లో ముగ్గురు టాప్ కమాండర్లు మృతి
- డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్ ప్రతిదాడులు
- వాటిని నేలకూల్చామన్న ఇజ్రాయెల్
టెల్ అవీవ్: ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై 5.1 తీవ్రత నమోదైంది. ఇది శుక్రవారం (జూన్ 21) రాత్రి 9:19 గంటలకు సెమ్నాన్ ప్రాంతంలో వచ్చిందని, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భూకంప ధాటికి ఇరాన్ రాజధాని టెహ్రాన్, దాని సమీప ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఐదు రోజుల కింద ఫోర్డో ప్రాంతంలోనూ 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు పరీక్షలు చేపట్టడంతోనే వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అటు ఫోర్డో, ఇటు సెమ్నాన్ ప్రాంతాల్లో అణు, అంతరిక్ష, క్షిపణి కేంద్రాలు ఉండడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఇరాన్లో సాధారణంగానే ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా 2 వేలకు పైగానే భూకంపాలు నమోదవుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు వచ్చిన భూకంపాలు కూడా సహజంగానే సంభవించి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు..
ఇరాన్లోని అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నది. ఇస్ఫహాన్ సిటీలోని అణుస్థావరాలు టార్గెట్గా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భీకర దాడులు చేసింది. తమ దాడుల్లో న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో న్యూక్లియర్ రీసెర్చ్ ఫెసిలిటీ డ్యామేజీ అయిందని ఇరాన్ కూడా ధ్రువీకరించింది.
మరోవైపు తమ దాడుల్లో ఇరాన్కు చెందిన ముగ్గురు టాప్ కమాండర్లు చనిపోయారని ఇజ్రాయెల్ ప్రకటించింది. ‘‘మేం జరిపిన దాడిలో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ పాలస్తీనా విభాగం హెడ్ సయీద్ ఇజాదీ చనిపోయాడు. ఖోమ్ సిటీలో అతడు ఉన్న అపార్ట్మెంట్పై మా మిలటరీ దాడి చేసింది” అని తెలిపింది. దాడుల్లో సయీద్ ఇజాదీతో పాటు ఖుద్స్ ఫోర్స్కు చెందిన మరో ఇద్దరు టాప్ కమాండర్లు కూడా చనిపోయినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఖుద్స్ ఫోర్స్ వెపన్స్ యూనిట్ కమాండర్ బెహ్నం షహ్రియారీ, డ్రోన్ ఫోర్స్ కమాండర్ అమీన్ పౌర్ జోడకీ మృతి చెందినట్టు చెప్పింది.
ఇరాన్ మిసైల్ లాంచర్లు ధ్వంసం..
ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేసింది. డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. అయితే తమ దేశంలో పెద్దగా డ్యామేజీ జరగలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లను చాలా వరకు అడ్డుకున్నామని చెప్పింది. ఇరాన్ డ్రోన్ ఒకటి రెండంతస్తుల బిల్డింగ్ను తాకినప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది. ‘‘ఇరాన్ మిసైల్ లాంచర్లే లక్ష్యంగా మేం దాడులు చేస్తున్నాం. ఇప్పటికే 50 శాతానికి పైగా లాంచర్లను ధ్వంసం చేశాం” అని ఇజ్రాయెల్ అధికారి మాగెన్ డేవిడ్ అడోమ్ తెలిపారు.
కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు తమ పౌరులు 400 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్ హెల్త్ మినిస్ట్రీ శనివారం వెల్లడించింది. మరో 3,056 మంది గాయపడినట్టు తెలిపింది. అయితే హ్యూమన్ రైట్స్ గ్రూప్ లెక్కల ప్రకారం.. ఇరాన్లో కనీసం 657 మంది మృతి చెందినట్టు రిపోర్టులు ఉన్నాయి. ఇరాన్ ప్రతిదాడుల్లో ఇజ్రాయెల్లో కనీసం 24 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. కాగా, ‘ఆపరేషన్ సింధు’లో భాగంగా రెండో బ్యాచ్ కింద 290 మంది భారతీయ స్టూడెంట్లతో కూడిన మొదటి విమానం శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగింది. 256 మంది విద్యార్థులతో కూడిన మరో విమానం శనివారం సాయంత్రం ఇదే ఎయిర్ పోర్టులో ల్యాండైంది.