న్యూఢిల్లీ: బైజూస్ సీఈఓ రవీంద్రన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులను ఇష్యూ చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) చట్టాన్ని థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ (బైజూస్) ఉల్లఘించిందని, ప్రభుత్వానికి రూ.9,362 కోట్ల రెవెన్యూ నష్టం వచ్చిందని ఈడీ గతంలో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి రవీంద్రన్పై గతంలో కూడా లుకౌట్ నోటీసులను జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో వీటిని రెన్యూ చేసిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు పేర్కొన్నారు.
దేశం విడిచి వెళ్లిపోకుండా చూడడానికి లుకౌట్ నోటీసులను ఇష్యూ చేస్తారు. బైజూస్ అందుకున్న ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లపై ఈడీ దర్యాప్తు జరిపింది. ఈ కంపెనీ కూడా పెద్ద మొత్తంలో ఫండ్స్ను ఇండియా నుంచి విదేశాలకు తరలించామని ఒప్పుకుంది. విదేశాల్లోని తమ సబ్సిడరీలను ఏర్పాటు చేయడానికి ఫండ్స్ పంపించామని తెలిపింది. కానీ, ఈ పెట్టుబడులకు సంబంధించి డాక్యుమెంట్లను ప్రభుత్వానికి సబ్మిట్ చేయడంలో ఫెయిలైంది. ఫెమా 1999 చట్టాన్ని కంపెనీ ఉల్లంఘించిందని ఈడీ పేర్కొంది. కాగా, 2011 – 2023 మధ్య బైజూస్ రూ.28 వేల కోట్ల విలువైన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లను అందుకుంది.