రూ.9 వేల కోట్లకు బైజూస్ కు ఈడీ షోకాజ్ నోటీసులు

రూ.9 వేల కోట్లకు బైజూస్ కు ఈడీ షోకాజ్ నోటీసులు

పీకల్లోతు కష్టాల్లో ఉన్న విద్యా సేవల సంస్థ బైజూస్ కు మరో భారీ షాక్ తగిలింది. విదేశీ నిధుల చట్టాలను ఉల్లంఘించినందుకు రూ.9 వేల కోట్లను చెల్లించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే.. అధికారుల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ తమకు అందలేదని కంపెనీ ఎక్స్ (ట్విట్టర్ ) లో చెప్పింది.

బైజూస్ 2011 నుంచి 2023 మధ్యకాలంలో రూ.28 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) పొందిందని ఈడీ వాదన. అలాగే విదేశీ నిధులకు సంబంధించిన చట్టాలను బేఖాతరు చేస్తూ 9 వేల 754 కోట్లను ఓవర్సీస్ డైరెక్ట్ పేరుతో పంపించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

ఈడీ నోటీసులపై మీడియాలో వస్తున్న కథనాలపై బైజూస్ ఎక్స్ ద్వారా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ అందుకోలేదని చెప్పింది. బైజూస్‌ ఫెమా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపింది. ఈడీ నోటీసు అనేది దేశంలోనే అత్యంత విలువైన స్టార్ట్ అప్‌కు కీలక పరిణామం అని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.

బైజూస్ మాతృ సంస్థ  థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంజనీర్లు, ఉపాధ్యాయులైన బైజు రవీంద్రన్ అతని సతీమణి దివ్య గోకుల్‌నాథ్‌లు 2011లో స్థాపించారు. ప్రారంభంలో వారు పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లను అందించారు. ఇది విజయవంతం కావడంతో 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ను ప్రారంభించారు. కొద్ది కాలంలోనే యాప్‌కు విశేష ఆదరణ దక్కడంతో రెండేళ్ల తర్వాత పిల్లల కోసం గణిత యాప్, వారి పురోగతిని ట్రాక్ చేసేలా తల్లిదండ్రుల కోసం మరో యాప్‌ను ప్రారంభించారు.

 

 

2018 నాటికి బైజూస్ 1.5 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. దేశంలోని చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం యాప్ అంతలా విస్తరించింది. కరోనా సమయంలో కూడా దేశవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థలు మూసినప్పుడు , పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు మారాల్సి వచ్చినప్పుడు బైజూస్‌నే ఆశ్రయించారు. అగ్రస్థానానికి చేరిన బైజూస్.. 2021లో భారీ నష్టాన్ని నమోదు చేయడంతో దాని విలువ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఆపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల రాడార్ కిందకు చేరుకుంది. 

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో యాప్‌కు ఆదరణ తగ్గింది. అలాగే దాని పనితీరుపైనా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తమను బలవంతంగా ఖరీదైన కోర్సులను కొనుగోలు చేయించారని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. ఖర్చులను తగ్గించుకోవడానికి వేలాది మంది ఉద్యోగులను కూడా బైజూస్ సంస్థ తొలగించుకోవాల్సి వచ్చింది.

ఈ ఏడాది ప్రారంభంలో విదేశీ నిధులను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించారనే అభియోగాలతో బెంగళూరులోని బైజూస్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసింది. బైజూస్ చెల్లింపులు, రుణ ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ రుణదాతలు అమెరికాలోని కోర్టులను ఆశ్రయించడంతో కంపెనీ విదేశాల్లోనూ ఇబ్బందులను ఎదుర్కొంది. రుణదాతలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బైజూస్‌పై కేసు సైతం నమోదైంది.