ఐదో రోజూ రాహుల్​ను ప్రశ్నించిన ఈడీ

ఐదో రోజూ రాహుల్​ను ప్రశ్నించిన ఈడీ
  • ఐదో రోజూ రాహుల్​ను ప్రశ్నించిన ఈడీ
  • ఇప్పటి వరకు 50 గంటలకు పైగా విచారించిన అధికారులు
  • రేపు విచారణకు హాజరుకానున్న సోనియా

న్యూఢిల్లీ: వరుసగా ఐదో రోజు కాంగ్రెస్​ లీడర్​ రాహుల్​గాంధీ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) ముందు హాజరయ్యారు. నేషనల్​ హెరాల్డ్​ మనీలాండరింగ్​ కేసులో మంగళవారం ఈడీ అధికారులు రాహుల్​ను మరోసారి ప్రశ్నించారు. మంగళవారం ఉదయం 11.15 గంటలకు రాహుల్​గాంధీ ఢిల్లీలోని ఈడీ హెడ్​క్వార్టర్స్​కు చేరుకున్నారు. సుమారు పది గంటల పాటు రాహుల్​ను అధికారులు విచారించారు. రాహుల్​ విచారణ నేపథ్యంలో ఈడీ హెడ్​క్వార్టర్స్​ వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్​ విధించారు. మొత్తంగా రాహుల్​ గాంధీ ఐదు రోజుల్లో  50 గంటల పాటు ఈడీ ఆఫీసులో ఉన్నారు. పలు దఫాలుగా ఈడీ అధికారులు రాహుల్​ను ప్రశ్నించి.. ఆయన స్టేట్​మెంట్స్​ను రికార్డు చేసుకున్నారు. గత వారం వరుసగా మూడు రోజుల పాటు రాహుల్​ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. గతవారం విచారణ తర్వాత ఆయన తల్లి సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్నందున కాస్త విరామం తీసుకునేందుకు అనుమతించారు. అయితే సోనియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ కావడంతో సోమవారం నుంచి మళ్లీ విచారణను తిరిగి ప్రారంభించారు. సోమవారం అర్ధరాత్రి వరకు రాహుల్​ను అధికారులు విచారించారు. మంగళవారం కూడా విచారణకు రావాలని, స్టేట్​మెంట్​ను పూర్తి చేయాలని కోరడంతో ఆయన ఈడీ ఆఫీసుకు మరోసారి వచ్చారు. మరోవైపు గురువారం తమ ఎదుట హాజరుకావాలంటూ సోనియా గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.