
- ఈ ఏడాది ఏప్రిల్- అక్టోబర్లో 20.6 శాతం గ్రోత్
- విదేశాల్లో చదువుకునేందుకే లోన్ బాట
- లోన్ టికెట్ సైజ్ సగటున రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షలు
న్యూఢిల్లీ : ఎడ్యుకేషన్ లోన్లు తీసుకోవడం భారీగా పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన ఎడ్యుకేషన్ లోన్లు రూ. 1,10,715 కోట్లకు చేరుకున్నాయి. కిందటేడాది అక్టోబర్ నాటికి ఇవి రూ.96,853 కోట్లుగా రికార్డయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ – అక్టోబర్ మధ్య 20.6 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) గ్రోత్ నమోదు చేశాయి. ఆర్బీఐ డేటా ప్రకారం, గత ఐదేళ్ల నుంచి ఎడ్యుకేషన్ లోన్లు తీసుకోవడం బాగా పెరిగింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన ఎడ్యుకేషన్ లోన్లు 12.3 శాతం వృద్ధి చెందాయి. 2019–20 లో ఇవి 3 శాతం తగ్గాయి. కరోనా సంక్షోభం తర్వాత విదేశాల్లో, ఇండియాలో విద్యా సంస్థల క్యాంపస్లు ఓపెన్ కావడం పెరిగింది. పెంటప్ డిమాండ్ కారణంగా ఎడ్యుకేషన్ లోన్లు తీసుకోవడం ఎక్కువయ్యిందని ఎస్బీఐ సీనియర్ ఎకనామిస్ట్ వివేకనంద పాండా పేర్కొన్నారు. లో బేస్ కారణంగానూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎడ్యుకేషన్ లోన్లు ఎక్కువగా వృద్ధి చెందినట్టు కనిపిస్తోందని వెల్లడించారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన ఎడ్యుకేషన్ లోన్లలో కూడా విదేశాల్లో చదువుకోవడానికి తీసుకున్నవే ఎక్కువ ఉన్నాయి. వీటి వాటా 65 శాతంగా ఉంది. లోన్ సైజ్ యావరేజ్గా రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉంది.
మరింతగా పెరిగే ఛాన్స్
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ కన్జూమర్ లోన్లు, పర్సనల్ లోన్లపై రిస్క్ వెయిట్ను పెంచాలని ఆర్బీఐ తాజాగా ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ రూల్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్లకు మినహాయింపు ఇచ్చారు. దీంతో రానున్న క్వార్టర్లలో ఈ టైప్ లోన్లు మరింత పెరుగుతాయని పాండా అంచనా వేస్తున్నారు. యూఎస్లో చదువు కోవడం కోసం ఎక్కువగా ఎడ్యుకేషనల్ లోన్లు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. యూఎస్ ఎంబసీ, ఇండియాలో ఉన్న యూఎస్ కాన్సులేట్స్ కిందటేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య రికార్డ్ లెవెల్లో 1.40 లక్షల స్టూడెంట్ వీసాలను ఇష్యూ చేశాయి. ఈ వీసాలు తీసుకున్న మెజార్టీ విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్పైనే చదువుకోవడానికి వెళ్లారని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. లోన్ తీసుకోవడం సులభం అయ్యిందని, ఎడ్యుకేషన్ లోన్ సెగ్మెంట్ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని చెప్పారు. ఈజీగా లోన్ కోసం అప్లయ్ చేసుకోవడానికి వీలుంటోందని, లోన్ డిస్బర్సల్ కూడా ఆన్లైన్లోనే వేగంగా జరిగిపోతోందని వెల్లడించారు. బ్యాంకులతో పాటు ఎన్బీఎఫ్సీలు కూడా ఎడ్యుకేషన్ లోన్లపై ఫోకస్ పెట్టాయి. హెచ్డీఎఫ్సీ క్రెడిలా వంటి ఫైనాన్షియల్ సంస్థలు ఎటువంటి కొలేటరల్ లేకుండానే రూ.50 లక్షల వరకు లోన్ ఆఫర్ చేస్తున్నాయి. లోన్ ప్రాసెస్ మొత్తం డిజిటల్గా జరుగుతోంది. వీడియో నో యువర్ కస్టమర్ (కేవైసీ) తో ప్రాసెస్ మరింత సులభమయ్యింది. లోన్ డిస్బర్సల్ కూడా అప్లికేషన్ పెట్టిన వారంలోనే పూర్తవుతోంది. రేటింగ్ ఏజెన్సీల డేటా ప్రకారం, ఎన్బీఎఫ్సీ లు ఇచ్చిన ఎడ్యుకేషన్ లోన్లు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 2022–23 లో 100 శాతం వృద్ధి చెందాయి.