
ఒకప్పుడు ప్రయాణం చేయాలంటే ఎడ్లబండ్లు, ఆ తరువాత కార్లు, బైక్, బస్సులు, రైళ్లు, విమానాలు వచ్చాయి. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగి.. ఇప్పుడు విద్యుత్ వాహనాలు వచ్చాయి. ఈ బైక్, ఎలక్ట్రిక్ కార్లు ఇలా ఇప్పుడు బస్సులు కూడా వచ్చాయి. ఇవన్నీ రోడ్డుపై తిరిగే వాహనాలు. ఇప్పుడు ఆకాశంలో విహరించే విమానాలు ఈ ఫ్లైట్స్ అందుబాటులోకి వచ్చాయి.
స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ కొత్త చరిత్ర
మొదట్లో పిస్టన్ ఇంజిన్ తో నడిచే విమానాలు ఉండేవి. ఆ తరువాత జెట్ విమానాలు వచ్చాయి. ఇప్పుడు విమానయాన చరిత్రలో స్కాండినేవియన్ ఎయిర్లైన్స్ కొత్త చరిత్రను లిఖించనుంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ విమానాన్ని(Electric Aircraft) ప్రయాణానికి రెడీ చేసింది. ఈరోజు (జూన్ 2) మధ్యాహ్నం నుంచి విమానం టిక్కెట్లను కూడా విక్రయించడం ప్రారంభించింది. తొలుత మూడు ఎలక్ట్రిక్ విమానాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఒక్కో దాంట్లో 30 చొప్పున మొత్తం 90 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే స్వీడన్, నార్వేలో నివసించే వారికి మాత్రమే టికెట్స్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. స్కాండినేవియన్ దేశాల వెలుపల ఉన్న వారికి ఈ విమానాలు అందుబాటులో ఉండవు. ఈ విమానాలు ఏయే రూట్ లలో నడుస్తాయి అనేది త్వరలోనే ప్రకటించనున్నారు.
టికెట్ ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ విమానాలకు సంబంధించిన ఒక్కో టికెట్ ధర రూ.24వేలు. వచ్చే ఐదేళ్లలో అంటే 2028 నాటికి ఈ విమానాలను సంఖ్యను పెంచే దిశగా స్కాండినేవియన్ ఎయిర్లైన్ యోచిస్తోంది. 2022 సెప్టెంబరులో స్కాండినేవియన్ ఎయిర్లైన్.. ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగిన స్వీడిష్ కంపెనీ “హార్ట్ ఏరోస్పేస్ “తో ఒప్పందం కుదుర్చుకుంది. హార్ట్ ఏరోస్పేస్ కంపెనీ తాము తయారు చేసే ES-30 ఎలక్ట్రిక్ విమానాలను స్కాండినేవియన్ ఎయిర్లైన్ కు విక్రయించనుంది.