
ఇండియాలో టెస్లా కారు రూ.20లక్షలు!
ప్లాంట్ ఏర్పాటుకు ప్రిలిమినరీ ప్రపోజల్స్ను సబ్మిట్ చేసిన కంపెనీ
ఏడాదికి 5 లక్షల వెహికల్స్ తయారీ సామర్ధ్యంతో గిగా ఫ్యాక్టరీ
లొకేషన్పై చర్చించేందుకు ప్రభుత్వంతో త్వరలో సమావేశం
తెలంగాణకు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక నుంచి గట్టి పోటీ
న్యూఢిల్లీ : ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇండియాలో ప్లాంట్ పెట్టడానికి రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించి ప్రిలిమినరీ ప్రపోజల్స్ను ఎలన్ మస్క్ కంపెనీ సబ్మిట్ చేసిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా ఏడాదికి ఐదు లక్షల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే ఆలోచనలో టెస్లా ఉందని చెప్పారు. ఒకవేళ ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తయారీ సామర్ధ్యం ప్రకారం మారుతి, హ్యుండాయ్ తర్వాత మూడో అతిపెద్ద కంపెనీగా టెస్లా నిలవనుంది. ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టడంపై గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ యూఎస్ పర్యటనకు వెళ్లే ముందు అంటే ఈ ఏడాది మేలో కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. యూఎస్ పర్యటనలో మోదీ కూడా మస్క్తో పర్సనల్గా సమావేశం అయ్యారు. ‘ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేలా మాపై ప్రధాని మోదీ ఒత్తిడి తెస్తున్నారు. మేము కూడా ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాం. సరియైన టైమ్ కోసం ఎదురు చూస్తున్నామంతే. వీలున్నంత తొందరగా టెస్లా ఇండియాలో అడుగు పెడుతుంది’ అని మోడీతో సమావేశం అయ్యాక మస్క్ పేర్కొన్నారు. ఈ మీటింగ్ జూన్ 21 న జరగగా, కొన్ని వారాల్లోనే ఇండియాలో టెస్లా తయారీ ప్లాంట్ పెట్టడానికి పనులు స్టార్టయ్యాయి.
ఏ రాష్ట్రానికి వస్తుంది!
టెస్లా ప్రతినిధులతో కామర్స్ మినిస్ట్రీ తరచూ చర్చలు జరుపుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. మార్కెట్లోని ఇతర కంపెనీల మాదిరే అవకాశాలు కలిపించి, మంచి డీల్ను కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. టెస్లా ఇండియాలో భారీగా ఇన్వెస్ట్ చేస్తుందని, వివిధ మోడల్స్ను ఇక్కడే తయారు చేయడంతో పాటు దేశం మొత్తం మీద ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, విడిభాగాల నెట్వర్క్ను డెవలప్ చేస్తుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది, ఎక్కడ ప్లాంట్ పెడుతుందనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, రూ. 20 లక్షల ధర నుంచి ప్రారంభమయ్యే కార్లను ఇండియాలో తయారు చేయొచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల రేట్లు రూ.20 లక్షల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ ధరకే కార్లను అమ్మితే కస్టమర్లను భారీగా ఆకర్షించడానికి టెస్లాకు వీలుంటుంది. మరోవైపు టెస్లా తన ప్లాంట్ను పెట్టడానికి మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, గుజరాత్, తెలంగాణను పరిగణనలోకి తీసుకోవచ్చని , ఈ రాష్ట్రాలు ముందు వరసలో ఉన్నాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, టెస్లా ప్రతినిధులు త్వరలో సమావేశం కానున్నారని, గిగా ఫ్యాక్టరీని పెట్టడానికి అనువైన ప్లేస్ కోసం చర్చలు జరపనున్నారని అన్నారు.
స్పెషల్ ఇన్సెంటివ్స్..
టెస్లాను ఇండియాకు రప్పించడానికి మోదీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పీఎల్ఐ స్కీమ్లో ఫేజ్2 ను ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈవీలకు సపోర్ట్గా ఉన్న ఫేమ్ స్కీమ్లో భాగంగా ఫేమ్3 ని అమలు చేసే ఆలోచనలో ఉంది. ఫేమ్2 వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. కాగా, టెస్లా కార్లను ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో అమ్మాలని కంపెనీ చూసింది. ఇందుకోసం దిగుమతులపై సుంకాలను తగ్గించాలని మోదీ ప్రభుత్వాన్ని మస్క్ కోరారు. కానీ, ఇందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. కంపెనీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేమని, ఇండియాలోనే తయారు చేసి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకోవాలని టెస్లాకు వివరించింది. కంపెనీ తయారీ ప్లాంట్ పెట్టడంపై తాజాగా పనులు మొదలయ్యాయి. ఇండియాను మాన్యుఫాక్చరింగ్ హబ్గా చేసుకొని ఇక్కడి నుంచి ఇండో పసిఫిక్ రీజియన్లోని దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది.
ఏఐ కంపెనీ ఏర్పాటు చేసిన మస్క్..
చాట్జీపీటీ తెచ్చిన ఓపెన్ఏఐకి పోటీగా ఎలన్ మస్క్ ఎక్స్ఏఐ పేరుతో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీని ప్రారంభించారు. చాట్జీపీటీ రాజకీయంగా పక్షపాతం చూపుతోందని ఆరోపించారు. ఎక్స్ఏఐని సపరేట్ కంపెనీగా మస్క్ నడపనున్నారు. యూనివర్స్ యొక్క నిజమైన లక్షణాలను అర్థం చేసుకోవడమే ఎక్స్ఏఐ ముఖ్యమైన లక్ష్యమని కంపెనీ వెబ్సైట్లో ఉంది. రియల్టీని, జీవితంలోనే అతిపెద్ద ప్రశ్నలను అర్థం చేసుకోవడమే తన కొత్త కంపెనీ లక్ష్యమని మస్క్ అన్నారు. ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైండ్, టెస్లా, టొరొంటో యూనివర్సిటీల్లో ఒకప్పుడు పనిచేసిన వారిని తన కొత్త కంపెనీలో స్టాఫ్గా ఆయన తీసుకున్నారు.