
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీలు డబ్బు కోసం గ్లోబల్ ప్రైవేటు ఈక్విటీ కంపెనీల వైపు చూస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ మార్కెట్లో పట్టు సాధించడానికి పోటీపడేందుకు ఫండ్స్ సేకరించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈవీ కంపెనీలే కాకుండా, యాన్సిలరీలూ ఇదే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీలు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీల నుంచి 1.5 నుంచి 2 బిలియన్ డాలర్ల దాకా డబ్బు సమీకరించనున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, ఆయా కంపెనీల ఫౌండర్లు చెబుతున్నారు. హీరో ఎలక్ట్రిక్, ఆథర్ ఎనర్జీ, ప్యూర్ ఈవీ, సింపుల్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, ఓబెన్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. పెద్ద కంపెనీలు 100 నుంచి 250 మిలియన్ డాలర్ల ఫండింగ్ కోరుకుంటుంటే, చిన్న కంపెనీలు 30 నుంచి 60 మిలియన్ డాలర్ల ఫండింగ్ కోసం చూస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మార్కెట్ సైజులో ఈవీల వాటా ప్రస్తుతం 4 శాతానికి పెరిగింది. దీంతో ఈవీ టూ వీలర్ తయారీదారులు తమ యూనిట్ల కెపాసిటీ పెంచే ఆలోచనలు చేస్తున్నారు. దీంతోపాటు డీలర్ల నెట్వర్క్ పెంచుకోవాలనుకుంటున్నారు.